వార్నర్, స్మిత్ ఉన్నా:
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకోవడంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నారు. దీంతో వారిద్దరూ లేని ఆస్ట్రేలియాపై భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గంభీర్ స్పందించి ఏ జట్టుకైనా సవాలు విసిరే ఫాస్ట్ బౌలర్లు భారత జట్టుకు ఉన్నారని, గత పర్యటన లాగే ఈసారి కూడా టీమిండియా పేసర్లు ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపిస్తారన్నాడు. గురువారం ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'ఏ పరిస్థితుల్లోనైనా.. ఏ జట్టుకైనా మన పేసర్లు సవాల్ విసరగలరు. గతసారి ఆసీస్ పర్యనటలో మనోళ్లు అదరగొట్టారు. ఈసారి కూడా ఆతిథ్య జట్టుకు దీటుగా ప్రదర్శన చేస్తారు. ఈసారి వార్నర్, స్మిత్ ఆడుతున్నా భయపడాల్సిన అవసరం లేదు. మన పేసర్లు వాళ్లకు కూడా చుక్కలు చూపిస్తారు' అని అన్నాడు.
టీ20 ప్రపంచకప్ జరుగడం కష్టమే:
ఢిల్లీ ఎంపీ ఐసీసీ ఛైర్మన్ పదవిపై స్పందింస్తూ.. సౌరవ్ గంగూలీ ఆ పదవికి పోటీ చేయాలని ఆకాంక్షించాడు. ఈ విషయంలో దాదా ఏమనుకుంటున్నాడో తనకు తెలియదని, కానీ అంతర్జాతీయ క్రికెట్ మండలిలో అత్యున్నత పదవిలో భారత ప్రతినిధి ఉంటే బాగుంటుందని చెప్పాడు. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగడం కష్టమేనని గౌతీ అభిప్రాయపడ్డాడు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని భారత్లో క్రికెట్ పోటీల పునఃప్రారంభంపై బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నానని గౌతమ్ గంభీర్ చెప్పాడు.
71 ఏళ్ల కల:
ఎన్నో ఏళ్ల నిరీక్షణను తెరదించుతూ ఏడాదిన్నర కిందట ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ అందుకుంది విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు. 1947 నుంచి భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నా 2018 వరకు ఒక్క టెస్టు సిరీస్లో కూడా విజయం సాధించలేదు. కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఘనత సాధించి 71 ఏళ్ల కలను నెరవేర్చడంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకుంది. నాలుగు టెస్టుల సిరీస్ను కోహ్లీసేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
2-1 తేడాతో సిరీస్ కైవసం:
అప్పటి సిరీస్లో ఛటేశ్వర్ పుజారా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగులతో విజయం సాధించింది. రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలుపొందడంతో సిరిస్ 1-1తో సమం అయింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 137 పరుగులతో విజయం సాధించింది. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టుకు పలు మార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను కోహ్లీసేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బుమ్రా 17 యావరేజితో 21 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇందులో ఒక ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది. ఇక పుజారా 74.42 యావరేజితో 521 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.