హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరిస్లో ఇప్పటికే మూడు టెస్టులు ముగిశాయి. ఇరు జట్లు చెరో టెస్టు గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. రాంచీ టెస్టు డ్రాగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈ సిరిస్లో ఆటతో పాటు వివాదాలు కూడా చుట్టుముట్టాయి.
బెంగుళూరులో టెస్టులో జరిగిన డీఆర్ఎస్ రివ్యూ వివాదంతో పాటు తాజాగా రాంచీ టెస్టులో కోహ్లీ గాయంపై ఆసీస్ ఆటగాళ్లు ఎగతాళి చేయడం, కెప్టెన్ కోహ్లీ కూడా ఆదే విధంగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వివాదాలపై టీమిండియా వెటరన్ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు.

స్లెడ్జింగ్ అనేది ఆటలో తప్పదని గంబీర్ చెప్పుకొచ్చాడు. దానివల్ల ఆటలో భిన్న మార్పులు చోటుచేసుకుంటాయని, కొన్ని సందర్భాలలో ఆసక్తికర సంఘటనలు జరుగుతాయని పేర్కొన్నాడు. బ్యాట్, బంతి వరకు మాత్రమే పరిమితమైతే క్రికెట్లో మజా ఉండదని, అయితే వ్యక్తిగత కక్ష పెంచుకునేందుకు మాత్రం పరిస్థితులు దారితీయకూడదని చెప్పాడు.
'ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు స్లెడ్జింగ్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే స్లెడ్జింగ్ వల్ల ఆటలో మజా వస్తుంది. అయితే ఈ సిరీస్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అవుట్ విషయంలో డీఆర్ఎస్ రివ్యూ కోసం చేసిన తప్పిదంతో ఆట మరింత రసవరత్తరంగా మారింది' అని గంభీర్ అన్నాడు.
'ఆటగాళ్లు రోబోలేం కాదు కనుక కొన్నిసార్లు స్లెడ్జింగ్ చేస్తారు. దేశం కోసం ఆడుతున్నప్పుడు కొన్ని బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. అయితే ఏం చేసినా వ్యక్తిగత దూషణ చేయకూడదు. ఆటవరకే అది పరిమితం కావాలి. గత రెండు టెస్టులు క్రికెట్ అభిమానులకే కాదు. తాజా, మాజీ క్రికెటర్లకు వినోద విందును రుచిచూపించాయి' అని గంభీర్ అన్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేత ఎవరో నిర్ణయించే ధర్మశాల టెస్టు మార్చి 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్టులో టీమిండియా మ్యాచ్ ఫెవరేట్గా బరిలోకి దిగుతుంది. గత రెండు టెస్టుల్లో టీమిండియా అద్భుతమైన ఆటను ప్రదర్శించిందని, చివరి టెస్టులో తప్పక విజయం సాధిస్తుందని గంభీర్ ఆశాభావం వ్కక్తం చేశాడు.