గంగూలీతో పోలుస్తూ:
ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత క్రికెట్ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. మహీ కెప్టెన్సీలో భారత్ 2007లో అంతర్జాతీయ టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ను గెలిపొందింది. అలాగే 2013లో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్లో కూడా భారత్ టాప్ ప్లేస్లో నిలిచింది. ఇక ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కూడా సాధించింది. దీంతో ధోనీని చాలా సందర్భాలలో డైనమిక్ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో పోలుస్తూ ఉంటారు. కొందరు దాదా బెస్ట్ అంటే.. మరికొందరు మహీ బెస్ట్ అంటారు. అయితే మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం దాదానే సపోర్ట్ చేశాడు.
క్వాలిటీ ప్లేయర్స్ను ఇవ్వలేకపోయాడు:
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.... 'ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు విరాట్ కోహ్లీకి క్వాలిటీ ప్లేయర్స్ను ఇవ్వలేకపోయాడు. జట్టులో కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేరు. ముఖ్యంగా టోర్నమెంట్లలో జట్టుని గెలిపించగల వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్లు లేరు. అప్పట్లో సౌరవ్ గంగూలీ మంచి ఆటగాళ్లను మహీకి ఇచ్చాడు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి అత్యుత్తమ క్రికెటర్లను ఇచ్చాడు. ధోనీ మాత్రం కోహ్లీకి ఎవరినిచ్చాడు' అని ప్రశ్నించాడు.
ధోనీకి కూడా అవకాశం:
వాస్తవానికి సౌరవ్ గంగూలీ తన కెప్టెన్సీలో ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆడే అవకాశం కల్పించాడు. యువరాజ్సింగ్, హర్భన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ఖాన్, ఆశిష్ నెహ్రాలను జట్టులోకి తీసుకొచ్చాడు. ఎంఎస్ ధోనీకి కూడా అవకాశం ఇచ్చింది దాదానే. మహీ కెరీర్ ఆరంభంలో పరుగులు చేయపోయినా.. వరుస అవకాశాలు ఇచ్చాడు. మహీ లాంటి ఎంతో మందికి జట్టులో ఆడే అవకాశాన్ని ఇచ్చాడు. గంగూలీ సారథ్యంలో ఎంతో మంది క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. కెప్టెన్ కూల్ ధోనీ కూడా చాలా మందినే జట్టులోకి తీసుకున్నాడు.
2005లో జట్టు పగ్గాలను వదిలేసిన దాదా:
2000లో భారత్ జట్టు ఫిక్సింగ్ వివాదంలో కూరుకుపోయిన దశలో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీ.. భారత జట్టుకి దూకుడు నేర్పి విదేశాల్లోనూ జట్టుకి విజయాల్ని అందించాడు. ఈ క్రమంలో ఎంతో మంది యువ క్రికెటర్లకి అవకాశాలిచ్చిన దాదా.. 2005లో అనుకోకుండా జట్టు పగ్గాలను వదిలేయాల్సి వచ్చింది. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీ తీసుకున్నాడు. ఆ తర్వాత 2007లో టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన ధోనీ.. 2014 వరకూ మూడు ఫార్మాట్లలోనూ సారథిగా కొనసాగాడు. 2014లో టెస్టు కెప్టెన్, 2017లో పూర్తి స్థాయి కెప్టెన్ బాధ్యతల నుండి మహీ తప్పుకున్నాడు.