
భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ఆసియా కప్ 2022లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్లలో కోహ్లీ మంచి ప్రదర్శనలు కనబర్చడంతో అతను తన పీక్ ఫామ్ను అందుకోవడానికి అలాగే అవసరమైనంత ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి దోహదపడుతుందని గంభీర్ చెప్పాడు. హాంకాంగ్పై కోహ్లీ 44బంతుల్లో 59నాటౌట్ ఆడడం మంచిదైందన్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ దాడి ఎలాంటిదనేది ఇక్కడ మాట్లాడుకోకూడదు..
ఎలాంటి బౌలింగ్ అయిన పరుగులు చేయగలిగడనేది ముఖ్యం అని గంభీర్ చెప్పాడు. యుఏఈలో జరిగే ఆసియా కప్ టోర్నీకి ముందు ఫామ్ కోసం తీవ్రంగా తంటాలు పడ్డ కోహ్లీకి.. ఈ మ్యాచ్లో మిడిలార్డర్లో నిలదొక్కుకున్న విధానం చాలా ప్రోత్సాహాన్నిస్తుందని గంభీర్ చెప్పాడు.
ఇకపోతే హాంకాంగ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 3సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి తాను ఫామ్లోకి తిరిగి వచ్చిన సంకేతాలను చూపించాడు. అలాగే అతను పాకిస్థాన్ మీద 34బంతుల్లో 35పరుగులు చేసి కాస్త స్థిరమైన ప్రదర్శన కనబరిచాడు. హాంకాంగ్ మ్యాచ్లో వికెట్ చాలా నెమ్మదిగా ఉండడంతో కుదురుకోవడానికి కోహ్లి చాలా టైం వెచ్చించాడు. కుదురుకున్నాక మాత్రం పరుగుల వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్తో కలిసి 98పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇండియాకు మంచి స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
'విరాట్ కోహ్లీ ఫామ్ చాలా ముఖ్యమైనదని నేను అనుకుంటున్నా. అతను హాంకాంగ్ మ్యాచ్లో మనం అనుకున్నట్లు త్వరగా పరుగులు సాధించలేదు.. కానీ మధ్యలో అతను గ్రౌండ్లో గడపడం ముఖ్యం. ఈ ఫిఫ్టీ అనేది నిజంగా చాలా బూస్ట్ ఇస్తుంది. ప్రత్యర్థితో సంబంధం లేదు.. ఫిఫ్టీ అంటే ఫిఫ్టీనే. ఇలాంటి మ్యాచ్ పరిస్థితిలో పరుగులు చేయడం చాలా ముఖ్యం. మీరు ఎంత నెట్ ప్రాక్టీస్ చేస్తారనేది పెద్దగా వర్కవుట్ కాదు.
రియల్ టైం మ్యాచ్లో మిడిల్ ఓవర్లలో మీరు పరుగులు చేసినప్పుడు వచ్చే ఆత్మవిశ్వాసం నెట్ ప్రాక్టీసులో రాదు. ఇక ఇక్కడి నుండి కోహ్లీ పీక్ ఫామ్ అందుకుంటాడని నేను నమ్ముతున్నాను. అతని ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మేము అతని నుంచి మెరుగైన ప్రదర్శనలను చూడగలుగుతాం' అని గంభీర్ చెప్పాడు.