టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్పై మాజీ క్రికెట్ర్, ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో రాహుల్ కెప్టెన్సీ వ్యూహాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అతనికి గంభీర్ మద్దతుగా నిలిచాడు. కెప్టెన్గా కేవలం నాలుగు మ్యాచ్ల ఫలితాలను చూసి రాహుల్ నాయకత్వంపై ఓ అంచనాకు రావడం సరికాదని చెప్పాడు. రాహుల్కు బ్యాటర్గానే కాకుండా కెప్టెన్గా గొప్ప భవిష్యత్ ఉందని గంభీర్ తెలిపాడు. గెలుపోటములను సమానంగా స్వీకరించడమే ఒక కెప్టెన్ లక్షణమని చెప్పుకొచ్చాడు. ఆ లక్షణం రాహుల్కు ఉందన్నాడు. గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం రాహుల్కు తెలియదన్నాడు. రాహుల్లో అదే గొప్ప లక్షణమని ఆయన తెలిపాడు. ఇక కెప్టెన్సీ అంటే ఒక్క రోజులో నేర్చుకునేది కాదని, అది నిరంతర ప్రక్రియ అని గంభీర్ చెప్పాడు.
ప్రతిరోజు మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తుండాలని, అప్పుడే గొప్పగా రాణించగలమని గంభీర్ అన్నాడు. ఈ లక్షణాలన్నీ రాహుల్కు ఉన్నాయని చెప్పాడు. రాహుల్ చాలా ప్రశాంతంగా, నిబద్దతతో ఉంటాడని, అలాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారని ఆయన చెప్పుకొచ్చాడు. అందుకే అతడి విషయంలో అప్పుడే ఒక అభిప్రాయానికి రావడం సరికాదని గౌతం గంభీర్ అభిప్రాయపడ్డారు. కాగా రానున్న ఐపీఎల్ సీజన్లో గౌతం గంభీర్, లోకేష్ రాహుల్ కొత్త జట్టైన లక్నోకు ప్రాతినిధ్యం వహించనున్నారు. రాహుల్ కెప్టెన్గా ఉండనుండగా.. గంభీర్ మెంటార్గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్ముంట్ ఇది వరకే ప్రకటించింది. కాగా ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ రానున్న ఐపీఎల్ మెగా వేలంపై దృష్టి సారించింది.
కాగా కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఇప్పటివరకు పెదగా సక్సెస్ కాలేకపోయాడు. ఐపీఎల్తోపాటు భారత జట్టుకు కూడా రాహుల్ కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ రాణించలేకపోయాడు. ముఖ్యంగా తన వ్యూహాల పరంగా విమర్శల పాలయ్యాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు రాహుల్ రెండు సీజన్ల పాటు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ క్రమంలో బ్యాటర్గా అదరగొట్టినప్పటికీ నాయకుడిగా మాత్రం విఫలమయ్యాడు. రెండు సీజన్లలో కనీసం ఒక్కసారి కూడా జట్టును ప్లేఆఫ్స్ చేర్చలేకపోయాడు. ఇక భారత జట్టుకు 4 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించగా ఆ నాల్గింటిలోని టీమిండియా ఓటమి పాలైంది.