ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. ముఖ్యంగా చివరి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా మ్యాచ్ను మలుపు తిప్పిన తీరు అమోఘం. ఆ విజయంతోనే భారత జట్టు సిరీస్ను 2-2 తో డ్రా చేసుకోగలిగింది. మ్యాచ్ తర్వాత గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తన ఆధిపత్య వైఖరిని ప్రదర్శించారు. చివరి టెస్ట్ మ్యాచ్లో మొదటి నాలుగు రోజులు ఇంగ్లండ్ జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించినందున ఇది అవసరం కూడా. ఈ నేపథ్యంలో గంభీర్ కేవలం తన సంతోషాన్ని లేదా ఉపశమనాన్ని వ్యక్తం చేయడానికి మాత్రమే ప్రెస్ కాన్ఫరెన్స్కు రాలేదు. తన వ్యూహాలను అనుమానించే వారికి తన గురించి పూర్తిగా తెలియదని చెప్పడానికి వచ్చారు.
సవాళ్లను స్ఫూర్తిగా తీసుకునే కోచ్లలో గౌతమ్ గంభీర్ ఒకరు. ఇంగ్లండ్లో 2-2తో సిరీస్ ను సమం చేసి తిరిగి రావడం, టెస్ట్ క్రికెట్లో భారత ప్రదర్శనను మెరుగుపరచడానికి తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు సరైనవని ఆయన నిరూపించారు. ఇప్పుడు రాబోయే ఆరు నెలలు గౌతమ్ గంభీర్ పరిమిత ఓవర్ల క్రికెట్పై ఎక్కువగా దృష్టి సారిస్తారు. దీనికి ఆసియా కప్తో శ్రీకారం చుట్టనున్నారు. టీ20 జట్టుపై ఎక్కువకాలం పనిచేసే అవకాశం గౌతమ్ గంభీర్కు ఇది మొదటిసారి. అయితే, ఈ జట్టును దాదాపుగా గంభీరే సెట్ చేసినందున ఈ ఫార్మాట్లో జట్టును నిర్వహించడం ఆయనకు పెద్ద కష్టం కాదు.

యువ ఆటగాళ్లపై గంభీర్ నమ్మకం
భారత క్రికెట్ జట్టులో గౌతమ్ గంభీర్ టీ20 ఫార్మాట్ ప్రయాణం ఒక కీలక మార్పుతో ప్రారంభమైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా ముందున్నా సూర్యకుమార్ యాదవ్కు పగ్గాలు అప్పగించబడ్డాయి. రోహిత్, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు లేకపోవడంతో గంభీర్ తన ఆలోచనలను డ్రెస్సింగ్ రూమ్లో సులభంగా అమలు చేయగలిగారు. భారత జట్టులో తన పాత్రను స్వీకరించడానికి ముందు గంభీర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. 'భారత టీ20 ప్రపంచ కప్ జట్టును ఐపీఎల్ ఆధారంగా ఎంపిక చేయాలి' అని అన్నారు. దీనితో గంభీర్ ప్రస్తుతం కీలక మార్పులు చేయాలనుకోవడం లేదని స్పష్టమవుతుంది. కానీ పెద్ద ఆటగాళ్లను వారి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకురావడానికి ఆయన వెనుకాడరని కూడా తెలుస్తుంది.
అంతే కాకుండా.. కొత్త ఆటగాళ్లకు బాధ్యతలు అప్పగించడంలో ఆయన వెనకడుగు వేయరని సమాచారం. అది 2014లో కేకేఆర్లో సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే అయినా లేదా లక్నో సూపర్ జెయింట్స్లో ఆయుష్ బదోనిని ప్రోత్సహించడమైనా సరే. టెస్ట్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ పరిణతి చెందడంలో గంభీర్ అచంచలమైన మద్దతు చాలావరకు దోహదపడింది.
అన్ని ఫార్మాట్లకూ ఒకే కెప్టెన్
గంభీర్ ఆటగాళ్ల నుంచి నిలకడను కోరుకునే కోచ్. భారత క్రికెట్లో ఇప్పుడు అన్ని ఫార్మాట్లకూ ఒకే కెప్టెన్ను నియమించాలని ఆయన త్వరలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారని చర్చ జరుగుతోంది. ఇది ఆటగాళ్ల మధ్య ఒకే విధమైన వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది. గంభీర్ దృక్పథం చాలా స్పష్టంగా ఉంది. టీ20 జట్టుకు కొత్త రూపాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ ఫార్మాట్లో భారత్ తరచుగా కాలంతో పాటు మారడం లేదని ఆరోపణలు ఎదుర్కొంది. గంభీర్ ఈ సమస్యను టీ20 నిపుణులైన ఆటగాళ్లతో పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం ఆయనకు ఇబ్బంది కాదు. అందుకే గత ఏడాది రమణ్దీప్ సింగ్, మయాంక్ యాదవ్లకు అవకాశం ఇచ్చారు.
ఒక వ్యూహకర్తగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టిన ఫార్మాట్ టీ20 ఫార్మాటే కావడం గమనార్హం. పది సంవత్సరాల క్రితం కేకేఆర్ కెప్టెన్గా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచి, 2024లో మెంటర్గా తిరిగి వచ్చి జట్టుకు మూడో టైటిల్ను అందించారు. గంభీర్తో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నవారు, ఆయన మొత్తం మ్యాచ్ను 20 ఓవర్లుగా కాకుండా, 120 బంతులుగా విభజించి చూస్తారని చెబుతారు. 'ప్రతి బంతి ప్రభావం చూపాలి' అనేది ఆయనకు ఇష్టమైన నినాదం. ఆసియా కప్ ద్వారా రాబోయే నెలల్లో ఆయన ఎలా పనిచేయాలనుకుంటున్నారు అనేది మనకు తెలుస్తుంది, కానీ ప్రస్తుతం ఏదీ స్పష్టంగా చెప్పలేం.