హైదరాబాద్: టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జాతీ పట్ల, నిస్సహాయుల పట్ల సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండే గంభీర్ మరో సారి తన గళం వినిపించాడు. దాతృత్వంలోనూ అతడు మేటి. సుక్మాలో నక్సల్ చేసిన దాడిలో కన్నుమూసిన జవాన్ల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కశ్మీర్లోని ఉద్రిక్త పరిస్థితులపై గౌతీ ఆవేదన వ్యక్తం చేశాడు.
రిపబ్లిక్ టీవీ అసోసియేట్ ఎడిటర్ ఆదిత్య రాజ్ కౌల్ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ వాహనంపై స్థానికులు రాళ్లు విసురుతున్న వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. 'కశ్మీర్లో శ్రీనగర్లోని నౌహట్టాలో సీఆర్పీఎఫ్ వాహనాన్ని లక్ష్యంగా ఎంచుకొని రాళ్లతో ఎలా దాడి చేస్తున్నారో చూడండి. ఆ జిప్సీ తలుపులు తెరిస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కశ్మీర్లోని ఏ మీడియా సైతం దీన్ని బయటకు చూపించదు' అని ట్వీట్ చేశాడు. అతడి ట్వీట్కు గంభీర్ స్పందించాడు.
'తట్టుకోలేకపోతున్నా. రాళ్ల దాడి చేసేవారితో ఇంకా చర్చలు జరిపేందుకు అవకాశముందని భారత్ భావిస్తోందా! ఒక్కసారి వాస్తవ పరిస్థితిని గ్రహించండి. రాజకీయ మద్దతు ఇవ్వండి నా సైనిక దళాలు, నా సీఆర్పీఎఫ్ సత్తా ఏమిటో, ఫలితాలేమిటో చూపిస్తాయి. నా దగ్గరో పరిష్కారం ఉంది. కశ్మీర్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఓ వారం పాటు ఎలాంటి రక్షణ లేకుండా వారి కుటుంబాలతో నివసించాలి. ఆ తర్వాతే వారిని 2019 ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతించాలి. అప్పుడు గానీ వారికి సైనిక దళాల బాధలేమిటో, అసలు కశ్మీర్ అంటే ఏమిటో తెలియదు' అని గంభీర్ ట్వీట్ చేశాడు.