
హైదరాబాద్: రంజీ క్రికెట్లో ఢిల్లీ జట్టు తరుపున వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. తాజాగా 'బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' వెబ్ సిరీస్ ద్వారా డ్రస్సింగ్ రూమ్ విశేషాలు, అభిమాన ఆటగాడితో పాటు కొన్ని అనుభవాలను అభిమానులతో పంచుకున్నాడు.
అంతేకాదు భారత క్రికెట్ జట్టులో బిగ్గెస్ట్ ప్రాంక్స్టర్ ఎవరో కూడా గంభీర్ చెప్పేశాడు. 'డ్రస్సింగ్ రూమ్లో ప్రాంక్స్టర్ ఎవరంటే.. హర్భజన్ సింగ్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భజ్జీ నిజంగా రాక్స్టార్. భజ్జీతో ఉంటే మనకు సమయమే తెలియదు. అసలు బోర్ కొట్టదు. యువరాజ్ అని కొంతమంది చెప్పినా డ్రస్సింగ్ రూమ్లో భజ్జీనే ది బెస్ట్' అని గంభీర్ అన్నాడు.
'2009లో న్యూజిలాండ్తో నేపియర్లో జరిగిన టెస్టులో నేను చాలా ఎక్కువ సమయం బ్యాటింగ్ చేశాను. నేపియర్ టెస్టు నా మనసుకు చాలా దగ్గరంగా ఉంటుంది. ఆ టెస్టులో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఈ మ్యాచ్లో 137 పరుగులు చేశాను. నా కెరీర్లో ఈ ప్రదర్శన ఎప్పటికీ మరిచిపోలేను' అని గంభీర్ తెలిపాడు.
ఎప్పటికీ భారత్ తరుపున ఆడాలని తాను కోరుకుంటానని గంభీర్ అన్నాడు. ఒకరి కోసం బ్యాటింగ్ చేయాలని తానెప్పుడూ అనుకోలేదని అన్నాడు. 'రాహుల్ ద్రవిడ్తో కలిసి ఆడటమంటే చాలా ఇష్టం. మైదానంలో ప్రశాంతంగా, సహనంగా ఎలా ఉండాలో ద్రవిడ్ను చూసే నేర్చుకున్నా' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
'టెస్టు ఫార్మాట్లో రాణించాలంటే ఇది ఎంతో అవసరం. వన్డేలు, టీ20లు ఆడటం కంటే నాకు టెస్టులు ఆడటమే ఇష్టం' అని గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం గంభీర్ రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బెంగాల్తో జరిగిన సెమీఫైనల్లో సెంచరీతో మెరిశాడు. పదేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్కు వెళ్లింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.