గంభీర్ ఏడ్చిన ఘటన..
మైదానంలో ఎంత టెన్షన్ ఉన్నా కంపోజ్డ్గా కనిపించే గంభీర్.. తన జీవితంలో ఒకే ఒక్కసారి క్రికెట్ చూస్తూ ఏడ్చానని వెల్లడించాడు. వరల్డ్ కప్ నెగ్గినప్పుడు కూడా తన కళ్ల వెంట నీళ్లు రాలేదని చెప్పాడు. 2011లో ముంబైలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ నెగ్గిన తర్వాత హర్భజన్ సింగ్ తదితరులంతా సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తన కళ్ల వెంట అప్పుడు కూడా కనీళ్లు రాలేదన్న గంభీర్.. 1992 వరల్డ్ కప్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పుడు మాత్రం చాలా ఏడ్చాని చెప్పాడు. భారత్, శ్రీలంక మధ్య జరిగిన వన్డే మ్యాచ్ ప్రజంటేషన్ సమయంలో గంభీర్ ఈ విషయాన్ని పంచుకున్నాడు.
మ్యాచ్ ఫలితం..
ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 237/9 స్కోరు సాధించింది. భారత బౌలర్లలో కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటారు. అయితే వర్షం పడటంతో మ్యాచ్ను 47 ఓవర్లకు కుదించారు. కానీ లక్ష్యం మాత్రం 236 పరుగులుగా నిర్ణయించారు. ఛేజింగ్లో కెప్టెన్ అజారుద్దీన్ 93 పరుగులతో రాణించినా కూడా భారత జట్టు విజయం సాధించలేకపోయింది. చివరి బంతికి భారత ఆటగాడు వెంకటపతి రాజు రనౌట్ అవడంతో ఒక్క పరుగు తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
అందుకే ఏడ్చానేమో?
'నాకు బాగా గుర్తు.. ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్లో భారత జట్టు ఓడిపోయింది. ఆసీస్ చేతిలో కేవలం ఒక్క పరుగు తేడాతో భారత్ ఓడింది. క్రికెట్ విషయంలో నేను ఏడ్చిన ఏకైక సందర్భం అదే. ఇలా ఒకే ఒక్క రన్ తేడాతో ఇండియా ఓడినందుకే అప్పుడు ఏడ్చి ఉంటా. ఆ తర్వాత మళ్లీ క్రికెట్లో నేనెప్పుడూ కన్నీళ్లు రాల్చలేదు. వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా నా కళ్లలో నీళ్లు రాలేదు' అని గంభీర్ ఆ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాడు. ఆ వరల్డ్ కప్లో భారత జట్టు గ్రూప్ దశలో ఆడిన మొత్తం 8 మ్యాచుల్లో కేవలం రెండిట్లోనే నెగ్గింది. దీంతో 9 జట్లు పాల్గొన్న ఆ టోర్నీని ఏడో స్థానంలో ముగించింది.