అత్యుత్తమ ఇన్నింగ్స్ అదే:
తాజాగా స్టార్స్పోర్ట్స్ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'మూడు ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ నమ్మశక్యం కాని ఇన్నింగ్స్లు ఎన్నో ఆడాడు. అన్ని కోణాల్లోనూ అతని గొప్ప ఇన్నింగ్స్ల్లో పాకిస్థాన్పై సాధించిన 183 పరుగుల ఇన్నింగ్స్ ఒకటిగా నిలుస్తుంది' అని అన్నాడు. ఢాకా వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో పాక్ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ కేవలం 148 బంతుల్లో 22 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 183 పరుగులు సాధించాడు. దీంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
కోహ్లీకి అంత అనుభవం కూడా లేదు:
'330 లక్ష్యాన్ని ఛేదించాలి. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్ (0/1)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సమయంలో 330 పరుగుల ఛేధనలో 183 సాధించడం మామూలు విషయం కాదు. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై చేయడం సాధారణ విషయం అసలు కాదు. అప్పుడు కోహ్లీకి అంత అనుభవం కూడా లేదు. అయినా అద్భుతంగా ఆడాడు' అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్లో గంభీర్ 58 టెస్టుల్లో, 147 వన్డేల్లో, 37 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
తొలి ఓవర్లోనే షాక్:
ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 329/6 భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు మహ్మద్ హఫీజ్ (105), జాసిర్ జంషెద్ (112) శతకాలతో చెలరేగారు. యూనిస్ ఖాన్ (52) అర్ధ శతకం చేసాడు. ప్రవీణ్ కుమార్, అశోక్ దిండా చెరో రెండు వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో తొలి ఓవర్లోనే గౌతమ్ గంభీర్ పెవిలియన్ చేరాడు. సచిన్ టెండూల్కర్ (52), రోహిత్ శర్మ (68)లతో కలిసి విరాట్ కోహ్లీ (183) జట్టును ఆదుకున్నాడు. చివరలో సురేష్ రైనా (12), ఎంఎస్ ధోనీ (4) జట్టును విజయతీరాలు చేర్చారు.