ఐపీఎల్లో ట్రోఫీ నెగ్గిన అతి కొద్ది మంది కెప్టెన్లలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఒకడు. గతేడాది ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు గ్లోబల్ మెంటార్గా గంభీర్ వ్యవహరించాడు. అయితే వచ్చే ఐపీఎల్ ముందు అతను కీలక నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే సీజన్ నుంచి తను మళ్లీ కేకేఆర్తో కలవనున్నట్లు ప్రకటించాడు.
ఈ విషయాన్ని కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం కూడా ప్రకటించింది. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తను బయటకు వచ్చేసినట్లు గంభీర్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే కేకేఆర్ ఈ ట్వీట్ చేసింది. గంభీర్ మళ్లీ కేకేఆర్ ఫ్రాంచైజీతో కలుస్తున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొంది. అలాగే ఫ్రాంచైజీ యజమాని షారుఖ్ ఖాన్ కూడా ఈ వార్తపై సంతోషం వ్యక్తం చేసినట్లు పేర్కొంది.

తాజాగా గౌతం గంభీర్ కూడా ఈ వార్తపై స్పందించాడు. కేకేఆర్ మెంటార్గా రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు. 'నేను తిరిగొచ్చాయి. ఆకలిగా ఉన్నాను. నేను 23. ఆమీ కేకేఆర్' అని ట్వీట్ చేశాడీ లెజెండ్. గత రెండు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా గంభీర్ వ్యవహరించాడు. 2022 మెగావేలంలో ఆ జట్టు కూర్పును నిర్ణయించడంలో కూడా అతను కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఇక కేకేఆర్తో గంభీర్ అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతను 2011 నుంచి 2017 వరకు కేకేఆర్ తరఫున ఐపీఎల్ ఆడాడు. వీటీలో కూడా 2012, 2014 రెండు సీజన్లలో గంభీర్ సారధ్యంలోని ఈ టీం ట్రోఫీ కూడా అందుకుంది. తద్వారా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన ఫ్రాంచైజీగా కేకేఆర్ నిలిచింది. మళ్లీ కేకేఆర్ను అప్పటి స్థాయికి తీసుకెళ్లడం కోసం హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్తో కలిసి గంభీర్ పనిచేయనున్నాడు.