
కరోనా కోసం రూ. 50 లక్షలు:
దేశంలోని పలువురు ప్రముఖులు కరోనాపై పోరుకు మద్దతు ప్రకటించారు. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు విరాళాలు ప్రకటించారు. తాజాగా కరోనా వైరస్పై పోరుకు టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తనవంతు మద్దతు ప్రకటించాడు. ఎంపీల్యాడ్ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు సోమవారం ప్రకటించాడు. దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అవసరమైన పరికరాల కోసం ఈ మొత్తాన్ని ఇవ్వనున్నాడు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఓ లేఖ రాశాడు.

అవసరమైతే జైల్లో వేయాలి:
గంభీర్ లాక్డైన్ నేపథ్యంలో ప్రజల నిర్లక్ష్యంపై కూడా స్పదించాడు. కరోనా మార్గదర్శకాలను ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే జైల్లో వేయాలని పోలీసులకు సూచించాడు. 'మీ నిర్లక్ష్యం వల్ల మీ ఒక్కరే కాదు.. మీ కుటుంబం మొత్తాన్ని జైలు లేదా క్వారంటైన్కు తీసుకువెళ్తారు. దయచేసి సమాజానికి ముప్పుగా ఉండకండి. ఇంట్లోనే ఉండండి. ఇప్పుడు చేస్తున్న ఈ యుద్దం జీవితం కోసం. దీనికన్నా ఉద్యోగాలు, వ్యాపారాలు ఎక్కువ కాదు. అత్యవసర సేవలు అందించే వారు మినహా మిగతావారు లాక్డౌన్ను అనుసరించండి. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. జైహింద్' అని ట్వీట్ చేశాడు.

బజరంగ్ పెద్ద మనసు:
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా తన పెద్ద మనసు చాటుకున్నాడు. మహమ్మారి కరోనాపై పోరాటానికి తన వంతు సాయంగా ఆరు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించాడు. క్రికెట్ పిచ్చిలో మునిగే ఈ దేశం కోసం కోట్లు సంపాదించే క్రికెటర్లు ముందుకు రాకున్నా.. బాధ్యత గల క్రీడాకారుడిగా తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. అంతేకాకుండా ఈ వైరస్ ప్రపంచాన్నే మింగేసే పరిస్థితులున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ వాయిదా వేయాలని సూచించాడు. గతేడాది జరిగిన వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో కాంస్యం గెలుచుకున్న ఈ 25 ఏళ్ల బజరంగ్.. రైల్వేలో స్పెషల్ ఆఫిసర్గా ఉద్యోగం చేస్తున్నాడు.

4 వేల మాస్క్లు:
వైరస్ను అరికట్టేందుకు జరుగుతున్న చర్యల్లో భారత క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రాణాంతక వైరస్ నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన 4 వేల మాస్క్లను వడోదర ఆరోగ్య శాఖకు పఠాన్ బ్రదర్స్ అందించారు. ఈ అంశాన్ని సోమవారం ఇర్ఫాన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. రాబోయే రోజుల్లో తమకు వీలైనంత కృషి చేస్తామని కూడా తెలిపారు.


Click it and Unblock the Notifications












