హైదరాబాద్: సామాజిక అంశాలపై టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్ ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటాడు. తనకి ఇంత ఇచ్చిన అభిమానులకు ఏదో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో 'గౌతమ్ గంభీర్ ఫౌండేషన్'ను కూడా నిర్వహిస్తున్నాడు.
తాజాగా గౌతం గంభీర్ ఈ ఫౌండేషన్ ద్వారా నిరుపేదల ఆకలిని తీర్చేందుకు దేశ రాజధాని ఢిల్లీలో మొదటి కమ్యూనిటీ కిచెన్ను సోమవారం ఏర్పాటు చేశాడు. నగరంలోని పటేల్ నగర్లో 'ఏక్ ఆషా' అనే పేరుతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్ను గంభీర్ ప్రారంభించాడు.

'ఏ ఒక్కరూ ఆకలితో బాధపడుతూ, ఖాళీ కడుపుతో నిద్రపోకూడదు' అన్నది ఈ కిచెన్ ముఖ్య ఉద్దేశమని గంభీర్ అన్నాడు. ఏడాదిలో 365 రోజుల పాటు ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3గంటల వరకు ఉచితంగా భోజనం అందజేస్తామని గంభీర్ తెలిపాడు.
'ప్రపంచ కప్లు గెలిచాను, ఐపీఎల్ను గెలిచాను. ప్రత్యర్థులపై పైచేయి సాధించాను. ఇప్పుడు ఆకలిపై పోరాడి ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు సమయం వచ్చింది' అని గంభీర్ తన ట్విటర్లో పేర్కొన్నాడు.