న్యూఢిల్లీ: క్రికెటర్ల పైన సినిమాలు తీయవలసిన అవసరం ఏమిటని గౌతమ్ గంభీర్ అన్నాడు. ప్రముఖ క్రికెటర్, ట్వంటీ 20, వన్డె కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా ఎంఎస్ ధోనీ.. ది అన్టోల్డ్ స్టోరీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇది త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలో గంభీర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన మాట్లాడుతూ.. క్రికెటర్ల కంటే దేశం కోసం త్యాగాలు చేసిన వారు, గొప్ప పనులు చేసిన వారు ఎందరో ఉన్నారని చెప్పారు. వారి పైన సినిమాలు తీయాలని సూచించాడు.

క్రికెటర్ల జీవితం పైన సినిమాలు తీసే అంశంపై తనకు నమ్మకం లేదని నిర్మోహమాటంగా చెప్పేశాడు. దేశం కోసం, సమాజం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన వారి సినిమాలు తీస్తే బాగుంటుందని అతను అభిప్రాయపడ్డాడు. కాగా, ధోనీ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఎంఎస్ ధోనీ.. ది అన్ టోల్డ్ స్టోరీ ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది.