విరాట్ కోహ్లి అంటే తనకి ఎంతో గౌరవం ఉందని టీమిండియా నయా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. కోచ్గా బాధ్యతలు అందుకున్న గంభీర్ ఇవాళ తొలిసారిగా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చాడు. కోహ్లితో తనకి మంచి సంబంధం ఉందని, ఆ అనుబంధాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకోవట్లేదని అన్నాడు. టీఆర్పీ పెంచడం కోసం రిలేషన్షిప్ గురించి కబుర్లు చెప్పనని పేర్కొన్నాడు.
ఓ ఆటగాడిగా విరాట్ కోహ్లిపై తనకి అపారమైన గౌరవం ఉందని గౌతమ్ గంభీర్ అన్నాడు. కోహ్లి వరల్డ్ క్లాస్ అథ్లెట్, క్లాస్ ప్లేయర్ అని కొనియాడాడు. దేశం కోసం ఇద్దరం కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నామని, జట్టుకు విజయాలు అందించడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు.

ఐపీఎల్లో విరాట్ కోహ్లి-గౌతమ్ గంభీర్ మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే. 2013, 2015లో వీరిద్దరు తీవ్ర వాగ్వాదం చేసుకున్నారు. ఇక 2023లో కోహ్లి-గంభీర్ గొడవను క్రికెట్ అభిమానులు సులువుగా మరిచిపోలేరు. లక్నో మెంటార్గా ఉన్న గంభీర్- ఆర్సీబీ బ్యాటర్ కోహ్లి మ్యాచ్ అనంతరం ఒకరిపైనొకరు దూసుకెళ్లారు. ఇంతటి రచ్చ అనంతరం విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ తిరిగి కలిసి పనిచేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు ఏమైనా జరుగుతాయేమో అని అభిమానులు ఆందోళన చెందారు. దీంతో మీడియా సమావేశంలో గంభీర్ స్పష్టత ఇచ్చాడు. కాగా, 2011 వన్డే ప్రపంచకప్ విజేత జట్టులో కోహ్లి, గంభీర్ సభ్యులుగా ఉన్నారు. దూకుడుగా ప్రత్యర్థిపై మీదకు దూసుకెళ్లే ఈ ఇద్దరూ ఢిల్లీకి చెందినవాళ్లే. 2006లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కోహ్లి అరంగేట్రం చేసినప్పుడు గంభీర్ ఢిల్లీ యూనిట్లోనే ఉన్నాడు.
కోహ్లి-గంభీర్ ఆదిలో మంచి మిత్రులుగా ఉన్నారు. 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తనకి వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గంభీర్.. కోహ్లికి అందించాడు. 224 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంలో కోహ్లి పాత్ర కీలకమని, తొలి సెంచరీ చేసిన యువ విరాట్కు గంభీర్ తన అవార్డు ఇచ్చాడు. మరోవైపు గంభీర్ కోహ్లి కెప్టెన్సీలోనే తన టెస్టు కెరీర్ ముగింపు పలికాడు.