ప్రపంచకప్ ముగిసిన తర్వాత
ప్రపంచకప్ ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకునేందుకు గాను బీసీసీఐ వెంటనే టికెట్లు ఏర్పాటు చేయకపోవడంతో భారత జట్టులోని ఆటగాళ్లు కొన్ని రోజులు ఇంగ్లాండ్లోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రపంచకప్ తర్వాత టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. వెస్టిండిస్ పర్యటన కోసం శుక్రవారం టీమిండియాను ఎంపిక చేయాల్సి ఉంది.
కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో
అయితే, విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో సెలక్షన్ కమిటీ సమావేశం చివరి నిమిషంలో వాయిదా పడినట్టు తెలుస్తోంది. అయితే వెస్టిండిస్ పర్యటన కోసం ఎంపిక చేసే జట్టులో ధోనీకి చోటు దక్కుతుందా? లేక విశ్రాంతిని ఇస్తారా? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఒకవేళ ధోనీకి చోటు దక్కకపోతే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ధోని రిటైర్మెంట్పై గంభీర్
ఇదిలా ఉంటే, తాజాగా ధోని రిటైర్మెంట్పై టీమిండియా మాజీ ఓపెనర్, ఎంపీ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ జట్టు కోసం ఎంతో చేసినప్పటికీ... యువ క్రికెటర్లను దృష్టిలో పెట్టుకొని తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవాలని గంభీర్ అన్నారు. "భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది. ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా అతను భవిష్యత్తు గురించే ఆలోచించే వాడు" అని చెప్పుకొచ్చాడు.
ఆస్టేలియాలో సచిన్, సెహ్వాగ్ ఆడలేరు
"నాకు ఇప్పటికీ గుర్తు... ఆస్టేలియాలో గ్రౌండ్లు పెద్దగా ఉంటాయి కాబట్టి సచిన్, సెహ్వాగ్ ఆడలేరని అన్నాడు. వచ్చే ప్రపంచకప్లో యువ ఆటగాళ్లు కావాలని ధోని ఆలోచించే ఉంటాడు. భావోద్వేగం కంటే జరుగుతుందనే నమ్మకం ఉన్న నిర్ణయాలు తీసుకుంటే మంచిది. రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఇలా ఏ యువ వికెట్ కీపర్ అయినా ఎదగాల్సిన అవసరం ఉంది" అని గంభీర్ అన్నాడు.
వికెట్ కీపర్గా గొప్ప పేరు తెచ్చుకోవాలని
"వికెట్ కీపర్గా గొప్ప పేరు తెచ్చుకోవాలని ఉన్న వాళ్లకు ఏడాది లేదా రెండేళ్ల పాటు అవకాశం ఇవ్వాలి. ఒకవేళ వాళ్లు సరిగ్గా ఆడకపోతే.. అప్పుడు వాళ్లను జట్టు నుంచి తప్పించాలి. వచ్చే ప్రపంచకప్లో అయినా మన వికెట్ కీపర్ ఎవరనే విషయంలో ఓ స్పష్టత ఉండాలి" అని గౌతమ్ గంభీర్ అన్నాడు.