
ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉంటారనేది బహిరంగ రహస్యమే. వీరిద్దరికి భారత్లో ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వీరిని అతిగా ఆరాధించడం ఫ్యాన్స్ మానుకోవాలని ప్రకటించాడు. భారత జట్టు క్రికెట్ లోపాలను వెలికితీసేటప్పుడు అభిమానులు ఒకరిద్దరిని (హీరో వర్షీప్ ) హీరోలా ఆరాధించడం అనే సంస్కృతికి స్వస్తి చెప్పాలి. వీళ్లని హీరోల్లా నెత్తినెట్టుకోవడం వల్ల మరో స్టార్కు రావాల్సినంత పేరు ప్రతిష్ఠలు రాకుండా పోతాయి. వాళ్ల నీడలో ఎవరూ గొప్ప పేరును, గుర్తింపును పొందలేకపోతారనేలా గంభీర్ వ్యాఖ్యానించాడు. ఫ్యాన్స్ గతంలో మహేంద్ర సింగ్ ధోనీని హీరోలా నెత్తినెట్టుకున్నారు.. ఇప్పుడేమో విరాట్ కోహ్లీని అంటూ గంభీర్ తెలిపారు.
'ఢిల్లీకి చెందిన కోహ్లీ సెంచరీ సాధించిన మ్యాచ్లోనే మీరట్ లాంటి చిన్న పట్టణానికి చెందిన భువనేశ్వర్ కుమార్ కూడా ఐదు వికెట్లు పడగొట్టగలిగాడు. కానీ కోహ్లీ గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. భువీ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. ఇది చాలా దురదృష్టకరం. భువీ గురించి నేనొక్కడినే వ్యాఖ్యానించాను. అతను నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు సాధించాడు. దాని గురించి అందరికీ తెలుసు.. కానీ అది ఎవరికీ పెద్ద అచీవ్మెంట్లాగా అనిపించదు.
అదే కోహ్లీ సెంచరీ చేసినందుకు మాత్రం దేశంలో ఎక్కడ చూసినా సంబరాలు మిన్నంటాయి. ఇలా ఒకరిద్దరు ప్లేయర్లను హీరోలా ఆరాధించే విపరీత కల్చర్ నుంచి భారత అభిమానులు బయటపడాలి. అది కేవలం భారత క్రికెట్ మాత్రమే కాదు.. రాజకీయాలైనా, ఇంకే రంగమైనా ఒకరిద్దరినీ అతిగా ఆరాధించడం మొదలెట్టి మిగతావాళ్లకు గుర్తింపు రాకుండా చేయడం సమంజసం కాదు.
మనం ఆరాధించాల్సిన ఏకైక విషయం టీమిండియాను' అని గంభీర్ తెలిపాడు. ఇటీవల కోహ్లీ గురించి గంభీర్ తరచూ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీ నంబర్ 3లోనే కరెక్ట్ అని.. ఓపెనర్గా అవసరం లేదని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక 10ఓవర్లు రోహిత్, రాహుల్ ఆడితే నంబర్ 3లో కోహ్లీని కాకుండా సూర్యను పంపించాలని కూడా గంభీర్ పేర్కొన్నాడు.