సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేన ఈ సిరీస్ అత్యంత కీలకం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు.
అయితే కివీస్తో జరిగిన టెస్టు సిరీస్లో భారత్ పరాజయానికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యం. దూకుడుగా ఆడే ప్రయత్నంలో దారుణంగా వికెట్లు సమర్పించుకున్నారు. సుదీర్ఘంగా క్రీజులో ఉండే ప్రయత్నాన్ని ఎవరూ చేయలేదు. అదే తరహా బ్యాటింగ్నూ కంగారూల గడ్డపై ప్రదర్శిస్తే టీమిండియా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఓ ఆసక్తికర ప్రశ్నను ఎదుర్కొన్నాడు. భారత క్రికెటర్లలో ఎవరు 11 గంటల పాటు బ్యాటింగ్ చేయగలరు? అని గంభీర్ను ప్రశ్నించారు. 11 గంటలే అంటే సుమారు ఒక రోజు పూర్తి ఆటతో పాటు మరో సెషన్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే దాదాపు నాలుగు సెషన్ల పాటు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవాల్సి ఉంది.
కాగా, దీనికి గంభీర్ బదులిస్తూ.. టీమిండియాలో టాప్-7 బ్యాటర్లు అందరూ 11 గంటల పాటు ఆడగలిగే సమర్థులని అన్నాడు. రోజంతా నిలబడి మ్యాచ్ను కాపాడగలరని చెప్పాడు. టెస్టు ఫార్మాట్లో భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో సాధారణంగా యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా వరుసగా క్రీజులోకి వస్తారు. కాగా, ప్రస్తుతం భారత్ సిమ్యులేషన్ సెషన్తో ఆస్ట్రేలియా సిరీస్కు సన్నద్ధమవుతోంది.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).