
సెలక్షన్ కమిటీ సభ్యులు తీరు బాగుండాలి:
టీమిండియాలో సీనియర్ క్రికెటర్లతో సెలక్షన్ కమిటీ సభ్యులు వ్యవహరించాల్సిన తీరు బాగుండాలని, వారితో సత్సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరముందని ఇటీవల మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్.. వెటరన్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఎమ్మెస్కే ప్రసాద్, కృష్ణమాచారి శ్రీకాంత్ తాజాగా ఓ కార్యక్రమంలో వాడివేడిగా చర్చించారు. మొదటగా గంభీర్ మాట్లాడుతూ.. కెప్టెన్ కూడా సెలక్టర్గా మారే సమయం ఆసన్నమైందన్నాడు.

కెప్టెన్కు ఓటేసే అవకాశం ఉండదు:
'జట్టు ఎంపికలో కెప్టెన్, కోచ్ సెలక్టర్లుగా ఉండాలి. తుది జట్టులో సెలక్టర్లు ఎవర్నీ కాదనరాదు. 11 మంది బాధ్యత కెప్టెన్దై ఉండాలి. అదే సమయంలో కెప్టెన్, కోచ్కు ఓటింగ్ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే.. సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టును వారు కొట్టిపారేయలేరు' అని గంభీర్ అన్నాడు. ఈ విషయంపై సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ... 'భారత క్రికెట్ నియమాల ప్రకారం ఎప్పుడైనా జట్టును ఎంపిక చేసేటప్పుడు కెప్టెన్ను సంప్రదిస్తారు. అందులో రెండు పద్ధతులు ఉండవవు. కెప్టెన్కు ఓటేసే అవకాశం ఉండదు' అని చెప్పాడు.

నాలుగో స్థానం సమస్యకు సరైన పరిష్కారం కనుగొనలేదు:
ఆపై గంభీర్ మాట్లాడుతూ... 2019 ప్రపంచకప్లో భారత జట్టులో నాలుగో స్థానం సమస్యకు సరైన పరిష్కారం కనుగొనలేదని ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని విమర్శించాడు. ప్రపంచకప్ జట్టులో కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని, ముఖ్యంగా అంబటి రాయుడుని ఎంపిక చేయలేదని గంభీర్ గుర్తుచేశాడు. రాయుడుని రెండేళ్లు నాలుగో స్థానంలో ఆడించి.. సరిగ్గా ప్రపంచకప్ ముందు తొలగించారు. సరిగ్గా అప్పుడే 3డీ క్రికెటర్ అవసరమయ్యాడా? సెలక్షన్ కమిటీ ఛైర్మన్ నుంచి ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు వినాలనుకుంటారా? అని ప్రశ్నించాడు.

ఆర్డర్లో అందరూ బ్యాట్స్మనే ఉన్నారు:
గంభీర్ వ్యాఖ్యలపై ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. టీమిండియా టాప్ ఆర్డర్లో అందరూ బ్యాట్స్మనే ఉన్నారని.. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో ఎవరూ బౌలింగ్ చేయన్నాడు. విజయ్ శంకర్ లాంటి ఆటగాడు టాప్ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలడని, అలాగే ఇంగ్లాండ్ పిచ్లపై బౌలింగ్ కూడా చేస్తాడని ప్రసాద్ వివరణ ఇచ్చాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్కు, దేశవాళీ క్రికెట్కూ మధ్య చాలా తేడా ఉందని చెప్పాడు.


Click it and Unblock the Notifications












