న్యూఢిల్లీ: ఢిల్లీ ఫిరోజ్షా కోట్ల మైదానంలో క్రికెట్ క్రీడకే మచ్చ తెచ్చే సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, పశ్చిమబెంగాల్ మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు గౌతం గంభీర్, మనోజ్ తివారీ శనివారంనాడు కొట్టుకున్నారు. ఎంపైర్ శ్రీనాథ్ను కూడా గంభీర్ తోసివేసినట్లు తెలిసింది. మ్యాచ్ రిఫరీ గౌతం గంభీర్, మనోజ్ తివారీకీ సమన్లిచ్చారు.
గౌతం గంభీర్, మనోజ్ తివారీ తొలుత తిట్టుకున్నారు. ఆ తర్వాత కొట్టుకున్నారు. మ్యాచ్ ఎనిమిదో ఓవర్ సందర్భంగా తివారీకి, గౌతం గంభీర్కు మధ్య మాటల యుద్ధం జరిగింది. మ్యాచ్ ఎనిమిదో ఓవరులో మనన్ శర్మానంద్ బౌలింగులో పార్థ సారథి భట్టాచార్జీ ఔటైన తర్వాత నాలుగో స్థానంలో తివారీ బ్యాటింగ్కు దిగాడు. తివారి బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే అకస్మాత్తుగా బౌలర్ను ఆపి, హెల్మెట్ కోసం డ్రెసింగ్ రూంవైపు సైగ చేశాడు.

సమయాన్ని వృధా చేసే ఎత్తుగడలో భాగంగానే తివారీ ఆ విధంగా చేశాడని ఢిల్లీ ఆటగాళ్లు భావించారు. అకస్తాత్తుగా స్లిప్లో బౌలింగు చేస్తున్న గంభీర్ రంగంలోకి దిగి బెంగాల్ స్కిప్పర్ తివారీని దూషించడం ప్రారంభించాడు. తివారీ దీటుగా జవాబిచ్చాడు. సాయంత్రం రా, నీ సంగతి చూస్తా అంటూ గంభీర్ హెచ్చరించాడు, సాయంత్రం దాకా ఎందుకు, ఇప్పుడే బయటకు వెళ్లి చూసుకుందాం, పద అని తీవారీ అన్నాడు.
ఆ సమయంలో అంపైర్ శ్రీనాథ్ జోక్యం చేసుకున్నాడు. తివారీ, గంభీర్ల మధ్య కొట్లాటను అదుపు చేసేందుకు యత్నించిన ఎంపైర్ శ్రీనాథ్ను గంభీర్ తోసివేసినట్లు తెలిసింది. తమ గొడవ మధ్యలోకి రావద్దని హెచ్చరించినట్లు సమాచారం.
ఢిల్లీ ఫిరోజ్షా కోట్ల మైదానంలో ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రంజీ మ్యాచ్ సందర్భంగా గౌతం గంభీర్, మనోజ్ తివారీ కొట్టుకున్న ఘటనలో మ్యాచ్ రిఫరీ కన్నెర్ర చేసినట్లు తెలిసింది. సహనం కోల్పోయి ఎంపైర్ శ్రీనాథ్ను తోసివేసిన గంభీర్పై నిషేధం తప్పదని సమాచారం.
ఇప్పటికే మ్యాచ్ రిఫరీ ఆటగాళ్లిద్దరికీ సమన్లు పంపడంతో గౌతం గంభీర్పై నిషేధం ఖాయమని తెలుస్తోంది. అయితే ఎంత కాలం నిషేధం విధిస్తారు. ఏ ఏ మ్యాచ్లలో గంభీర్పై నిషేధం ఉంటుందని తెలియాల్సి ఉంది. మ్యాచ్ సందర్భంగా అంపైర్ను ముట్టుకోవడాన్ని నేరంగా పరిగణిస్తారు.