హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త హల్చల్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గౌతమ్ గంభీర్ పశ్చిమ ఢిల్లీ నుంచి బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఈ ఓపెనర్ను కలిసిన ఢిల్లీ బీజేపీ నేతలు అతనికి టికెట్ ఇవ్వడంపై కూడా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీనిపై ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ "నోట్ల రద్దు, జీఎస్టీ, అక్రమ కట్టడాల తొలగింపునకు అనుమతులు ఇవ్వడంతో స్థానిక బీజేపీ నాయకులపై ఢిల్లీ ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఈ ప్రభావం ప్రధాని మోడీపై ఏమాత్రం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే బీజేపీ వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి టిక్కెట్లు ఇచ్చి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని వ్యూహాలు రచిస్తోంది" అని అన్నాడు.
"ఇందులో భాగంగా క్రికెటర్ గౌతమ్ గంభీర్తో పాటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ను బరిలోకి దించాలని చూస్తోంది. పశ్చిమ దిల్లీ నుంచి గంభీర్ను పోటీలోకి దింపాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి" అని ఆయన తెలిపారు. భారత్ జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్.. ఆ తర్వాత ఫామ్, ఫిట్నెస్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు.
ఆ తర్వాత దేశవాళీ క్రికెట్, ఐపీఎల్కే పరిమితమైన గంభీర్ 2016లో మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడటంతో.. అనూహ్యంగా భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే అవకాశమిచ్చిన మేనేజ్మెంట్.. మళ్లీ ఆ తర్వాతి టెస్టుకు పక్కన పెట్టింది.
ఈ ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ వరుస ఓటములకు మధ్యలోనే కెప్టెన్సీని వదిలేసిన గంభీర్.. ఆ తర్వాత సీజన్ ముగిసే వరకూ కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో గంభీర్ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడటంపైనా అనుమానాలు నెలకొన్నాయి. భారత్ తరఫున 2013లో రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో గంభీర్ చివరి సారిగా కనిపించాడు.