భారత క్రికెట్లో కీలక మార్పలు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. రేపటి లోపు టీమిండియా కొత్త కోచ్ను బీసీసీఐ ప్రకటించనుంది. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా హెడ్ కోచ్ స్థానాన్ని గౌతమ్ గంభీర్ చేపట్టడం దాదాపు ఖాయమైంది. అయితే కోచ్ రేసులో గంభీర్తో పాటు డబ్ల్యూవీ రామన్ కూడా నిలిచాడు. వీరిద్దరిని బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) మంగళవారం తొలి రౌండ్ ఇంటర్వ్యూ చేసింది.
మొదట గంభీర్కు తర్వాత రామన్కు సీఏసీ జూమ్ కాల్ ద్వారా ముఖాముఖీ నిర్వహించింది. వచ్చే మూడేళ్లలో భారత క్రికెట్ ప్రణాళికలను గంభీర్, భారత క్రికెట్ పురోగతి కోసం రోడ్ మ్యాప్ను రామన్ వివరించారు. అయితే రామన్ కంటే గంభీర్పైనే అడ్వైజరీ కమిటీ ఆసక్తిగా ఉందని సమాచారం. దీంతో గంభీర్ ఎంపిక లాంఛనమే అన్నట్టుగా తెలుస్తోంది.

కాగా, టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం గంభీర్ టీమిండియా కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మెగాటోర్నీ తర్వాత భారత్ జింబాబ్వేతో టీ20 సిరీస్, శ్రీలంకతో వన్డే సిరీస్ను ఆడనుంది. అయితే ఈ సిరీస్లకు ప్రపంచకప్లో పాల్గొన్న ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. కాగా, గంభీర్ కోచ్ బాధ్యతలు అందుకున్న తర్వాత శ్రేయస్ అయ్యర్ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక శ్రీలంకతో వన్డే సిరీస్కు శ్రేయస్ను కెప్టెన్గా లేదా కనీసం వైస్ కెప్టెన్గా ఎంపిక చేయాలని గంభీర్ ప్రతిపాదన చేయనున్నట్లు సమాచారం.
సెంట్రల్ కాంట్రాక్టు లిస్ట్లో చోటు కోల్పోయిన అనంతరం శ్రేయస్ అయ్యర్ భారత జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఐపీఎల్ ఆడిన శ్రేయస్ కోల్కతా నైట్ రైడర్స్ను విజేతగా నిలిపాడు. గంభీర్ మెంటార్గా, శ్రేయస్ కెప్టెన్గా కేకేఆర్ కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది. ఐపీఎల్లో శ్రేయస్ కెప్టెన్సీని మెచ్చిన గంభీర్ భారత బ్యాకప్ కెప్టెన్గా ఈ మిడిలార్డర్ బ్యాటర్కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. సీనియర్ ప్లేయర్లు శ్రీలంకతో సిరీస్కు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో శ్రేయస్ వైస్ కెప్టెన్గా ఎంపికవ్వడం సులభమే అని క్రికెట్ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి.