టీమిండియా కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపికవ్వడం దాదాపు ఖాయమైంది. మరికొన్ని రోజుల్లో బీసీసీఐ దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో బాధ్యతలు అందుకోవం కోసం గంభీర్తో పాటు డబ్ల్యూవీ రామన్ కూడా పోటీపడ్డారు. వీరిద్దరినీ బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ చేసింది. కోచ్గా గంభీర్కు అనుభవం లేదు. మరోవైపు రామన్కు అపారనుభవం ఉంది.
ఈ క్రమంలో బీసీసీఐ కొంత డైలామాలో పడినప్పటికీ చివరికి గౌతమ్ గంభీర్కే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండు సార్లు ప్లేఆఫ్స్కు చేర్చడం, ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంలో మెంటార్గా గంభీర్ది కీలకపాత్ర. దీంతో ఐపీఎల్ సక్సెస్రేటును దృష్టిలో ఉంచుకుని గంభీర్కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది.

అయితే బీసీసీఐ ముందు గంభీర్ కొన్ని డిమాండ్లను ఉంచాడని సమాచారం. దానికి బోర్డు ఓకే చెప్పడంతో గంభీర్ కోచ్ బాధ్యతలు అందుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ జాతీయ మీడియా ప్రకారం గంభీర్ అయిదు డిమాండ్లు బీసీసీఐ ముందు ఉంచాడు. అందులో మొదటి డిమాండ్.. ఒక్కసారి కోచ్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత బీసీసీఐ జట్టుకు సంబంధించిన విషయాల్లో ఎట్టిపరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదు. రెండో డిమాండ్.. అసిస్టెంట్ కోచ్లను, సహాయక బృందాలను తన ఇష్టానుసారం ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి.
మూడో డిమాండ్.. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహ్మద్ షమి, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు నిరాశపరిస్తే జట్టు నుంచి వాళ్లు వైదొలగాల్సి ఉంటుంది. వాళ్లంతా వన్డే ఫార్మాట్పై ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. ఇక నాలుగో డిమాండ్.. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని టెస్టు జట్టును సిద్ధం చేయాలి. దీనిలో సీనియర్లకు అవకాశం ఇస్తూ క్రమంగా యువ ఆటగాళ్లను జట్టులో భాగం చేయాలి.
ఆఖరి డిమాండ్.. వన్డే వరల్డ్ కప్-2027ను భారత్ సాధించేలా తన ప్రణాళికలు ఉంటాయని, అదే తన అంతిమ లక్ష్యమని బీసీసీఐతో గంభీర్ పేర్కొన్నాడు. దానికి తగ్గట్లుగానే ప్రతి నిర్ణయం ఉంటుందని, వాటిపై బీసీసీఐ కలుగజేసుకోకూడదని డిమాండ్ చేశాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.