లెజెండ్స్ లీగ్ లోని గుజరాత్ జెయింట్స్-ఇండియా క్యాపిటల్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్- శ్రీశాంత్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వాగ్వాదంలో తన తప్పేమి లేదని మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ వీడియో పోస్ట్ చేశాడు. అసభ్యకరమైన మాటలతో దూషించాడని ఆరోపణలు చేశాడు.
సహచర ఆటగాళ్లతో కారణం లేకుండా గంభీర్ గొడవలకు దిగుతుంటాడని, స్టార్ క్రికెటర్ సెహ్వాగ్ కు కూడా మర్యాద ఇవ్వడని శ్రీశాంత్ అన్నాడు. అయితే గంభీర్ దూషించినన మాటలు చెప్పనని తొలుత ప్రకటించిన శ్రీశాంత్.. తాజాగా సోషల్ మీడియాలో ఆ మాటలు వెల్లడించాడు. ఫిక్సర్ అంటూ అసభ్యకరమైన పదాలు అన్నాడని శ్రీశాంత్ వివరించాడు.

''గంభీర్ ను ఒక్క మాట కూడా అనలేదు. అతడు ఫిక్సర్, ఫిక్సర్ అంటుంటే.. ఏం మాట్లాడుతున్నావ్ అని రియాక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఫిక్సర్ అనే పదానికి అసభ్యకరమైన మాటలు జోడించాడు. అంపైర్ ముందు కూడా అలానే మాట్లాడాడు'' అని శ్రీశాంత్ తెలిపాడు.మరోవైపు గౌతమ్ గంభీర్ ఈ వివాదానికి ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యాడు.''ప్రపంచం మొత్తం మీ మీద దృష్టి పెట్టిన సందర్భంలో ఒక స్మైల్ ఇవ్వండి'' అంటూ తాను నవ్వుతున్న ఫొటోని పోస్ట్ చేసి దానికి క్యాప్షన్ రాసుకొచ్చాడు.
కాగా, ఈ మ్యాచ్ లో శ్రీశాంత్ వేసిన తొలి బంతిని గంభీర్ సిక్సర్ బాదాడు. తర్వాత బాల్ ను బౌండరీకి తరలించాడు. ఆ టైమ్ లో వీరిద్దరు ఒకరినొకరు సీరియస్ గా చూసుకున్నారు. తర్వాత కొద్దిసేపటికీ వాగ్వాదం జరిగింది.
కాగా, ఎలిమినేటర్ మ్యాచ్ లో ఇండియా క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ ఏడు వికెట్లకు 223 పరుగులు చేసింది. గంభీర్ 30 బంతుల్లో 51 పరుగులు చేశాడు. గుజరాత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీశాంత్ మూడు ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్ లో గుజరాత్ జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది.