తన కెరీర్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. సెలక్టర్ల కాళ్లు పట్టుకోని కారణంగా జట్టులో ఎంపిక కాలేని రోజులు కూడా ఉన్నాయని అన్నాడు. భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
తన 12-13 ఏళ్ల వయసులో అండర్-14 టోర్నీమెంట్ కోసం చాలా కష్టపడ్డానని గంభీర్ పేర్కొన్నాడు. కానీ సెలక్ట్ కాలేదని, అయితే ఎంపిక కాకపోవడానికి కారణం తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. కాళ్లు పట్టుకోలేదనే కారణంతో సెలక్టర్లు అతనిపై వేటు వేశారని తెలిపాడు. జట్టులో స్థానం కోసం ఆ పని ఎప్పిటికీ చేయకూడదని, మరింత కష్టపడి ఎంపిక అయ్యేలా సంకల్పంతో ప్రయత్నించానని అన్నాడు.

ఆ తర్వాత అండర్-16, అండర్-19, రంజీ ట్రోఫీ, భారత జట్టుకు ఎంపికయ్యానని గంభీర్ వివరించాడు. అయితే ఈ క్రమంలో విఫలమైన కొన్ని సందర్భాల్లో ఎన్నో విమర్శలు, సూచనలు ఎదుర్కొన్నాని తెలిపాడు. క్రికెట్కు ముగింపు పలకాలని, బిజినెస్ చూసుకోవాలని సన్నిహితులు సూచించారని చెప్పాడు. అయితే తనకి కుటుంబం కంటే క్రికెట్టే ఎక్కువ అని, ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోలేకపోయారని అన్నాడు.
భారత్ తరఫున గంభీర్ 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 4154 పరుగులు, వన్డేల్లో 5238 పరుగులు, పొట్టి ఫార్మాట్లో 932 రన్స్ చేశాడు. 2007 టీ20 వర్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్లో టీమిండియా విజయం సాధించడంలో గంభీర్ ప్రధాన పాత్ర పోషించాడు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు మెంటార్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
గంభీర్ రాకతో కేకేఆర్ నూతన ఉత్సాహంతో విజయాలు సాధిస్తుంది. ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్గా నిలిచి ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. క్వాలిఫయిర్-1లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో కోల్కతా ఇవాళ తలపడనుంది. గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ రెండు సార్లు టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.