టీమిండియా ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ని బీసీసీఐ నియమించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్ వేదికగా మంగళవారం వెల్లడించారు. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గంభీరే కోచ్ బాధ్యతలు అందుకుంటాడని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. గంభీర్ ఎన్నిక ఏకగ్రీవమని మొదట్లో జోరుగా ప్రచారం సాగింది. కానీ బీసీసీఐ అడ్వైజరీ కమిటీ మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ను కూడా ఇంటర్వ్యూకు ఆహ్వానించింది.
అయితే కోచ్గా అనుభవం లేనప్పటికీ గంభీర్కే బీసీసీఐ కోచ్ పదవిని కట్టబెట్టింది. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజేత అయిన గంభీర్ ఐపీఎల్లో సక్సెఫుల్ కెప్టెన్గానే కాకుండా మెంటార్గా ఘనత సాధించాడు. ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంలో మెంటార్గా గంభీర్ది కీలకపాత్ర. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ దూకుడు ఫార్ములాతో జట్టును సిద్ధం చేయడంలో గంభీర్ నేర్పరి.

ఈ విషయాలతో గంభీర్ను కోచ్గా బీసీసీఐ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా, భారత క్రికెట్ను గంభీర్ మరింత ముందుకు తీసుకెళ్తాడని విశ్వసిస్తున్నామని బోర్డు కార్యదర్శి జై షా పేర్కొన్నారు. '' భారత జట్టు కొత్త ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్కు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. ఆధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది. ఈ దశను గంభీర్ దగ్గరగా గమనించాడు''
''అతని కెరీర్లో వివిధ పాత్రల్లో కష్టాలను తట్టుకుని ముందుకు సాగిన గంభీర్ కోచ్గా భారత క్రికెట్ను ముందుకు నడిపిస్తాడనే నమ్మకం నాకు ఉంది.టీమిండియా పట్ల స్ఫష్టమైన దృష్టి, అపారమైన అనుభవం ఉన్న గంభీర్ ఈ ఉత్తేజకరమైన, అత్యంత డిమాండ్ ఉన్న కోచ్ పదవిని స్వీకరించడానికి సరైనోడు. అతని కొత్త ప్రయాణంలో బీసీసీఐ మద్దతుగా ఉంటుంది'' అని జై షా తెలిపాడు. కాగా, శ్రీలంక పర్యటనతో గంభీర్ కోచ్గా యాక్షన్లోకి దిగనున్నాడు.