భారత మాజీ కెప్టెన్, ప్రపంచకప్ విజేత మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు నేడు. తన 43వ బర్త్డే సెలబ్రేషన్స్ను ధోనీ చాలా సింపుల్గా చేసుకున్నాడు. అతికొద్ది మంతి ఆత్మీయుల సమక్షంలో కేక్ను కట్ చేసి స్పెషల్ డేను ప్రత్యేకంగా మలుచుకున్నాడు. అయితే ఈ సందర్భంగా ధోనీ గురించి స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది.
ఈ వీడియోలో మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, నాజర్ హుస్సేన్, డ్వేన్ బ్రావో, ఆర్పీ సింగ్ ధోనీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అంతేగాక ధోనీ గొప్పదనాన్ని వివరిస్తూ కొనియాడారు. భారత క్రికెట్ చరిత్రలో ధోనీనే అత్యుత్తమ కెప్టెన్ అని గంభీర్ ప్రశింసించాడు. ధోనీతో గల అనుబంధాన్ని పంచుకున్నాడు.

''ఎంతో మంది కెప్టెన్లు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ టీమిండియా తరఫున ధోనీ సాధించిన రికార్డును అందుకోవడం చాలా కష్టం. టెస్టుల్లో నంబర్ వన్ స్థానాన్ని అందుకోవచ్చు. విదేశాల్లో మ్యాచ్లను గెలవచ్చు. కానీ రెండు ఐసీసీ వరల్డ్ కప్లను, ఓ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోవడం ఎంతో ప్రత్యేకం. దీని కంటే గొప్ప విజయం మరొకటి లేదు''
''మేం ఎన్నో కీలక ఘట్టాల్లో కలిసి ఉన్నాం. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ విజయం, ఆస్ట్రేలియాలో కామెన్వెల్త్ బ్యాంక్ సిరీస్, న్యూజిలాండ్లో టెస్టు సిరీస్ గెలవడం, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ను డ్రా చేయడం, ఆసియా కప్ విజేతగా నిలవడం.. ఇలా ఎన్నో మధుర క్షణాల్లో భాగస్వామిగా ఉన్నాను. అతను భారతదేశ అత్యుత్తమ కెప్టెన్'' అని గంభీర్ పేర్కొన్నాడు.
సారథిగా ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలను దేశానికి అందించిన విషయం తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు మహీ అయిదు టైటిళ్లు అందించాడు. అయితే గత సీజన్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ వికెట్కీపర్గా సీఎస్కే జట్టులో కొనసాగుతున్నాడు.