దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత టీమిండియాలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై చేరుకున్న టీమిండియా బస్సులో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అభిషేక్ శర్మతో సీరియస్గా చర్చిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
బస్సులోనే క్లాస్ పీకిన గౌతమ్ గంభీర్
జింబాబ్వేతో జరగనున్న 'డూ ఆర్ డై'మ్యాచ్ కోసం టీమిండియా సోమవారం చెన్నై చేరుకుంది. ఎయిర్పోర్టు వెలుపల టీమ్ బస్సు ఎక్కిన తర్వాత, కోచ్ గౌతమ్ గంభీర్ డ్రైవర్ వెనుక సీటులో కూర్చున్న అభిషేక్ శర్మతో సుదీర్ఘంగా, చాలా కోపంగా మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. గంభీర్ తనదైన శైలిలో అభిషేక్ తప్పులను ఎత్తి చూపుతూ.. అతనికి గట్టిగా క్లాస్ తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. నెటిజన్లు దీనిని "చల్తీ బస్ మే కోచింగ్" (నడుస్తున్న బస్సులో కోచింగ్) అని అభివర్ణిస్తున్నారు.

గంభీర్ తీరుపై భిన్నాభిప్రాయాలు
ఈ వీడియో వైరల్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్, నిపుణులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు నెటిజన్లు గంభీర్ తీరును తప్పుబడుతున్నారు. "కెమెరాల ముందు ఇలా ప్రదర్శించడం ఆపండి. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ఎలా నింపాలో రోహిత్ శర్మను చూసి నేర్చుకోండి" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం గంభీర్ దూకుడును సమర్థిస్తున్నారు. వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లకు ఇలాంటి హెచ్చరికలు అవసరమని వారు భావిస్తున్నారు.
అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు
దక్షిణాఫ్రికా విధించిన 188 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. టోర్నీ ఆరంభం నుంచి అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దీనివల్ల భారత టాపార్డర్పై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచినప్పటికీ.. అభిషేక్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు.
జింబాబ్వేతో పోరు: తుది జట్టులో మార్పులు?
ఫిబ్రవరి 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. గంభీర్ తీసుకున్న క్లాస్ ప్రభావం అభిషేక్ బ్యాటింగ్పై కనిపిస్తుందా? లేదా వచ్చే మ్యాచ్లో అతడిని పక్కన పెట్టి కొత్త ఓపెనర్ను బరిలోకి దింపుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.