దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత ఓ ఐపీఎల్ జట్టు యజమాని గౌతమ్ గంభీర్ కోచింగ్పై బహిరంగంగా విమర్శలు చేశారు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్లో దక్షిణాఫ్రికాను 2-1తో ఓడించిన తర్వాత.. ఆ ఐపీఎల్ జట్టు యజమానికి గట్టి సమాధానం ఇచ్చాడు. తన పనిని తాను చూసుకోవాలని గంభీర్ సలహా ఇచ్చాడు.
గంభీర్కు ఎందుకు కోపం వచ్చింది?
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ముగిసింది. టీమిండియా 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

టెస్ట్ సిరీస్లో భారత జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. దక్షిణాఫ్రికా చేతిలో 2-0తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్ సోషల్ మీడియాలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టెస్ట్ క్రికెట్కు వేరే కోచ్ను నియమించాలని డిమాండ్ చేశారు. పార్థ్ జిందాల్ 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేస్తూ.. టీమిండియా ఓటమిపై నిరాశ వ్యక్తం చేశారు. ఇది భారత్లో అత్యంత బలహీనమైన టెస్టు జట్టు అని ఆయన పేర్కొన్నారు. అతను గౌతమ్ గంభీర్ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుంటూ.. టెస్ట్ ఫార్మాట్కు రెడ్ బాల్ స్పెషలిస్ట్ కోచ్ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. "ఇది ఎంత మాత్రం సరికాదు, సొంతగడ్డపై ఎంత దారుణంగా ఓడిపోయాం. మన టెస్టు జట్టు ఇంత బలహీనంగా ఎప్పుడు ఉందో నాకు గుర్తులేదు. రెడ్ బాల్ స్పెషలిస్ట్లను ఎంపిక చేయకపోతే ఇదే జరుగుతుంది. రెడ్ బాల్ ఫార్మాట్లో ఇంతకు ముందు ఉన్న శక్తికి ఇది ఏమాత్రం దగ్గరగా లేదు. ఇప్పుడు భారత్ టెస్ట్ క్రికెట్కు రెడ్ బాల్ స్పెషలిస్ట్ కోచ్ను నియమించే సమయం వచ్చింది." అని పార్థ్ జిందాల్ పేర్కొన్నారు.
వన్డే సిరీస్ విజయం తర్వాత గంభీర్ ఆగ్రహం
వన్డే సిరీస్ విజయం తర్వాత గౌతమ్ గంభీర్ చివరకు పార్థ్ జిందాల్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. గంభీర్ నేరుగా పేరును ప్రస్తావించకుండా.. ఐపీఎల్ జట్టు యజమానిని ప్రస్తావిస్తూ తీవ్రంగా స్పందించారు. "క్రికెట్కు బయట చాలా మంది ఉన్నారు. జట్టును నిర్మించడానికి ఎంత కృషి, అంకితభావం అవసరమో వారికి అర్థం కాదు. ముఖ్యంగా స్ప్లిట్ కోచింగ్ (వేర్వేరు కోచ్లు) గురించి మాట్లాడే హక్కు వారికి ఉందని నేను అనుకోను. నేను వారి విషయాలలో జోక్యం చేసుకోకపోతే, వారు నా విషయాలలో జోక్యం చేసుకునే హక్కు లేదు. ప్రజలు వారి పనిపై దృష్టి పెట్టడం నేర్చుకోవాలి. ఒక ఐపీఎల్ జట్టు యజమాని తన పని తాను చూసుకోవాలి. ఒక కోచ్ తన పని తాను చూసుకోవాలి." అని గంభీర్ మండిపడ్డారు.