ప్రస్తుతం క్రికెట్లో ప్రమాదంలో పడిన ఫార్మాట్ ఏదైనా ఉందంటే అది వన్డే ఫార్మాట్ అనే చెప్పాలి. కొన్ని రోజుల క్రిత వన్డే వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో ఏకంగా ఐసీసీ పెద్దలు కూడా కేవలం వరల్డ్ కప్లో మాత్రమే వన్డేలు ఆడించాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో వన్డే క్రికెట్ చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలనే చర్చ మొదలైంది.
ఇప్పుడు టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ తాజాగా ఈ విషయంలో కొత్త సజెషన్స్ తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఆడుతున్న వన్డే క్రికెట్ చాలా బోరింగ్గా ఉందని, దాన్ని మారిస్తేనే ఈ ఫార్మాట్ను ఇంట్రస్టింగ్గా మార్చగలమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అతను కొన్ని ఇంట్రస్టింగ్ సలహాలు ఇచ్చాడు. దీంతో వన్డే ఫార్మాట్ కూడా చాలా ఆసక్తికరంగా మారుతుందన్నాడు.

'మొదటి పది ఓవర్లలో ఏకంగా 9 మంది ఫీల్డర్లు 30 యార్డ్ సర్కిల్ లోపలే ఉండాలి. ఆ తర్వాత 20 ఓవర్ల వరకు సర్కిల్ లోపల ఐదుగురు ఉండాలి. ఇక 31 నుంచి 40 ఓవర్ల మధ్య సర్కిల్లో నలుగురు ఫీల్డర్లను ఉంచాలి. చివరి పది ఓవర్లలో కేవలం ముగ్గురు ఫీల్డర్లనే సర్కిల్లో ఉంచాలి. దీని వల్ల బౌండరీల వద్ద ఆరుగురు ఫీల్డర్లు ఉంటారు. అప్పుడు స్పిన్నర్లను కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది' అని గంభీర్ వివరించాడు.
అలాగే కొత్త బంతికి సంబంధించి కూడా చాలా ఆసక్తికర సూచన చేశాడీ లెజెండరీ ఓపెనర్. 'రెండు కొత్త బంతులతో మ్యాచ్ మొదలు పెట్టండి. కానీ వాటిని మొదటి 20 ఓవర్లలోనే ఉపయోగించుకోవాలి. వాటిలో ఏదో ఒక బంతిని ఎంపిక చేసుకొని, మిగతా 30 ఓవర్లు ఉపయోగించుకునే అవకాశాన్ని మాత్రం బౌలింగ్ కెప్టెన్కు వదిలేయాలి' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
అలాగే కేవలం ద్వైపాక్షిక సిరీసులు ఆడటం కూడా పెద్ద ఇంట్రస్టింగ్గా లేదని చెప్పాడు. 'ట్రై సిరీసులు, క్వాడ్రాంగులర్ (నాలుగు టీమ్స్ మధ్య జరిగే) సిరీసులు నాకు బాగా నచ్చేవి. కేవలం ద్వైపాక్షిక సిరీసులు ఆడటం చాలా బోరింగ్గా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి.. ఏడెనిమిది వన్డేల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా లేదంటే ఇండియా, ఆసీస్, న్యూజిల్యాండ్ ఆడితే ఎంత మజా ఉంటుంది?' అని గంభీర్ పేర్కొన్నాడు.