IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ఓ కీలక ప్రకటన చేశారు. గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాపై మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు చాలా కాలంగా ఏం చేస్తున్నారో అదే చేశారని అన్నారు. 50 ఓవర్ల ఫార్మాట్లో వారి ప్రదర్శన ఎప్పుడూ కీలకమైనదే కాబట్టి, వారు భవిష్యత్తులో కూడా ఇలాగే జట్టుకు సహకారం అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి భారత్ 2-1తో సిరీస్ను గెలుచుకున్న తర్వాత గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జట్టు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న విభేదాల గురించి ఆందోళన చెందుతున్న భారత అభిమానులకు ఇది గొప్ప ఉపశమనం కలిగించే విషయం.
గంభీర్, కోహ్లీ, రోహిత్ల మధ్య సంభాషణలో లోపం ఉందనే ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. గంభీర్ మీడియాతో మాట్లాడుతూ, "వారు చేయగలిగేదే చేస్తున్నారు. వారు చాలా కాలంగా భారత క్రికెట్ కోసం అదే చేస్తున్నారు. వారు ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను, ఇది వైట్-బాల్ ఫార్మాట్, 50 ఓవర్ల ఫార్మాట్కు ఎల్లప్పుడూ ముఖ్యమైనది" అని అన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 ప్రపంచ కప్లో తమ స్థానాలను పదిలం చేసుకునేందుకు కష్టపడుతున్నారు. ఆ సమయానికి వారిద్దరి వయస్సు 40కి దగ్గరగా ఉంటుంది. అయినప్పటికీ, ఏ ఒక్క ఆటగాడు కూడా వారిని జట్టు నుంచి తొలగించడానికి అవకాశం ఇవ్వడం లేదు. రోహిత్ గత నెలలో ఆస్ట్రేలియాపై 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' గెలుచుకోగా.. కోహ్లీ దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలతో సహా 300కు పైగా పరుగులు చేసి అదే అవార్డును దక్కించుకున్నారు.

ఇతర ఆటగాళ్ల ప్రశంసలు
గంభీర్ రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్లను కూడా ప్రశంసించారు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లకు గాయాల కారణంగా జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ ఆటగాళ్లు చెరో సెంచరీ సాధించారు."రుతురాజ్ వంటి ఆటగాళ్లు ఒత్తిడిలో బ్యాటింగ్ చేశారు, అతను అద్భుతమైన ఆటగాడు అని మనందరికీ తెలుసు. కానీ ఇండియా 'ఎ' కోసం అతని అద్భుతమైన ఫామ్ కారణంగా ఈ సిరీస్లో అతనికి అవకాశం ఇవ్వాలనుకున్నాం. అతను ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. రెండో మ్యాచ్లో మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు, 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పుడు అతను 100 పరుగులు చేశాడు, ఇది నిజంగా నాణ్యమైన ప్రదర్శన." అంటూ గౌతమ్ గంభీర్ పేర్కొనడం గమనార్హం.
"ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో యశస్వి జైస్వాల్లో ఎంత నాణ్యత ఉందో మనం చూశాం. వైట్-బాల్ క్రికెట్లో ఇది అతని కెరీర్ ప్రారంభం. అతని భవిష్యత్తు, రుతురాజ్ భవిష్యత్తు కూడా చాలా ఉజ్వలంగా ఉంటుందని ఆశిస్తున్నాను." ఈ సిరీస్ భారత క్రికెట్కు చాలా విధాలుగా కీలకమైనది. అనుభవజ్ఞులు తమ సత్తా చాటగా, యువ ఆటగాళ్లు కూడా తమ ప్రతిభను నిరూపించుకున్నారు. గంభీర్ చేసిన ఈ ప్రకటన జట్టులో సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.