గంభీర్ సంచలన వ్యాఖ్యలు.. ధోనీ వల్లే ప్రపంచకప్ సెంచరీ కోల్పోయా!!

న్యూఢిల్లీ: సమయం వచ్చినప్పుడల్లా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని టార్గెట్ చేసే మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.. మరోసారి విమర్శలు గుప్పించాడు. ధోనీ వల్లే 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో సెంచరీ కోల్పోయా అని గంభీర్ మండిపడ్డాడు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గురించి ఇప్పటివరకూ మాట్లాడని గంభీర్.. తాజాగా విమర్శలు చేశాడు.

మూడు పరుగులు చేయమన్నాడు:
గంభీర్ తాజాగా మాట్లాడుతూ... 'ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉన్నా. వ్యక్తిగత పరుగుల గురించి ఆలోచించలేదు. టార్గెట్ను మాత్రమే మనసులో పెట్టుకున్నా. ఈ సమయంలో ధోనీ నా దగ్గరకు వచ్చి మూడు పరుగులు చేస్తే సెంచరీ పూర్తవుతుందనే విషయం చెప్పాడు. అప్పుడు సెంచరీ కోసం ఆలోచించా' అని అన్నాడు.

అందువల్లే సెంచరీ కోల్పోయా:
'ధోనీ సెంచరీ గురుంచి చెప్పకముందు వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఒత్తిడికి గురయ్యా. సెంచరీ తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో దూకుడుగా షాట్ ఆడబోయి తిసార పెరీరా బౌలింగ్లో బౌల్డ్ అయ్యా. ఈ మూడు పరుగులు నన్ను జీవితాంతం వెంటాడతాయని పెవిలియన్కు వస్తూ అనుకున్నా. ఎందుకంటే అందరూ ఆ మూడు పరుగుల గురించే అడుగుతారని నాకు తెలుసు' అని గంభీర్ తెలిపాడు. ఫైనల్ మ్యాచ్లో ఎందుకు సెంచరీ పూర్తి చేయలేకపోయావని చాలామంది నన్ను అడుగుతుంటారు. అందుకే ఇప్పుడు వివరణ ఇస్తున్నా అని అన్నాడు.

రెండోసారి విశ్వవిజేతగా భారత్:
ముంబైలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక 275 పరుగుల టార్గెట్ను టీమిండియాకు నిర్దేశించింది. వీరేందర్ సెహ్వాగ్ డకౌట్ కాగా.. సచిన్ టెండూల్కర్ 18 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన గంభీర్ అద్భుతంగా ఆడాడు. విరాట్ కోహ్లీ (35) ఫర్వాలేదనిపించగా.. ధోనీ మ్యాచ్ను ఏకపక్షంగా మార్చారు. గంభీర్ 97 పరుగులు చేసి ఔట్ కాగా.. యువీతో కలిసి ధోనీ 91 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 1983 ప్రపంచకప్ తర్వాత రెండోసారి భారత్ విశ్వవిజేతగా నిలిచింది.

గంభీర్ కనబడుటలేదు:
రిటైర్మెంట్ అనంతరం గౌతం గంభీర్ తూర్పు ఢిల్లీ లోక్సభా స్థానం నుంచి బీజేపీ తరపున నిలబడి గెలిచిన విషయం తెలిసిందే. ఆదివారం ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో 'గంభీర్ కనబడుటలేదు' అని పలు పోస్టర్లు వెలిశాయి. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు గంభీర్ కనబడుటలేదు అని అర్ధం వచ్చేలా పోస్టర్లను చెట్లకు అంటించారు. అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి గంభీర్ గైర్హాజరు కావడమే ఈ పోస్టర్లు వెలువడానికి కారణంగా తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications