టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై సంచలన ఆరోపణలు చేశాడు భారత జట్టు, కేకేఆర్ మాజీ బ్యాటర్ మనోజ్ తివారీ. అసలే టెస్టుల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై ఓడి కోచింగ్ విషయంలో తీవ్ర విమర్శలు అందుకుంటున్న గంభీర్ పై తివారీ కూడా తీవ్రంగా విమర్శలు గుప్పించాడు. గంభీర్ కపటపరుడు అని అభివర్ణించాడు. అతడు తాను బోధించే సూత్రాలు, పాటించడని పేర్కొన్నాడు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారాయి.
గంభీర్ గతంలో తన కుటుంబం గురించి అసభ్యకరంగా మాట్లాడాడని పేర్కొన్నాడు తివారీ. మాజీ కెప్టెన్ గంగూలీ గురించి కూడా గంభీర్ తప్పుగా మాట్లాడాడని చెప్పుకొచ్చాడు. "దిల్లీ రంజీ ట్రోఫీలో మేం కలిసి ఆడేటప్పుడు, అక్కడ ఉన్న ప్రతిఒక్కరూ గంభీర్ అన్న మాటలు విన్నారు. అతడు నా కుటుంబం గురించి, గంగూలీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, కొంతమంది అతడిని మద్దతుగా నిలిచారు. అది అతడి పీఆర్ టీమ్." అని పేర్కొన్నాడు తివారీ.

"తుది జట్టు ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ కూడా సరిగ్గా జరగట్లేదు. హర్షిత్ రాణా కోసం ఆకాశ్ దీప్ ను తప్పించారు. పెర్త్ టెస్ట్ లో ఆకాశ్ దీప్ స్థానంలో హర్షిత్ రాణాను ఆడించారు. అసలు అదెలా సాధ్యం. ఆకాశ్ ఏం తప్పు చేశాడు. ఒకవేళ హర్షిత్ మరీ అంత మంచి ఆటగాడైతే ఆ తర్వాత అతడిని సిరీస్ లోని మిగతా మ్యాచ్ లకు ఎందుకు కొనసాగించలేదు. ఆకాశ్ కు అసలు మాట్లాడటం చేతకాదు. ఆకాశ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పై అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ అతడిని పక్కనపెట్టి హర్షిత్ రాణాను తీసుకున్నారు.
అతడికి అంతగా ఫస్ట్ క్లాస్ ఎక్స్ పీరియన్స్ కూడా లేదు. ఆకాశ్ కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి.ఇంకా దేవదత్ పడిక్కల్ టెస్ట్ స్క్వాడ్ లోకి ఎలా వచ్చాడు. అసలు అతడు లేడు కదా. అభిమన్యు ఈశ్వరన్ ఉంటే అతడు ఎలా వచ్చాడు. అభిమన్యును ఎందుకు తీసుకోలేదు. ఇలాంటివి ఎన్నో.. జట్టు ఎంపిక ప్రక్రియలో జరుగుతున్నాయి. దీని వల్ల జరిగే నష్టాలను అందరూ చూస్తూనే ఉన్నారు. ఇది కచ్చితంగా పక్షపాత వైఖరి. అందుకే కొంతమంది ఆటగాళ్లు గంభీర్ కు సపోర్ట్ చేస్తారు. అని విమర్శలు గుప్పించాడు తివారీ.
కాగా, తివారీ అన్న వ్యాఖ్యలకు నితీశ్ రాణా, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లు వ్యతిరేకించారు. గంభీర్ను నిస్వార్థ నాయకుడిగా అభివర్ణించారు. "గంభీర్ ఆపదలో ఉన్న ఎవరికైనా సహాయాన్ని అందిస్తాడు. ట్రోఫీలు ఆయన పనితీరుకు నిదర్శనం," అంటూ నితీష్ రాణా స్పందించాడు.