ధోనీ విధేయతను ఎప్పటికీ మర్చిపోను.. నా కోసం ఆ యాత్ర రద్దు చేశాడు: కిర్స్టన్

జొహాన్నెస్బర్గ్: తాను భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్గా ఉన్న సమయంలో కెప్టెన్గా ఉన్న ఎంఎస్ ధోనీ తన పట్ల ఎంతో విధేయతగా ఉండేవాడని గ్యారీ కిర్స్టన్ వెల్లడించాడు. ధోనీ గొప్ప నాయకుడని కీర్తించాడు. తన కెరీర్లో కలిసిన అత్యుత్తమ వ్యక్తిత్వమున్న వ్యక్తుల్లో ధోనీ ఒకడని పేర్కొన్నాడు. లీడర్గా మైదానంలో జట్టుని నడిపించడంలో ధోనీకి తిరుగులేదని కితాబిచ్చిన గ్యారీ.. మైదానం వెలుపల కూడా అతను నిజమైన నాయకుడిగా వ్యవహరించేవాడని చెప్పాడు. అందుకు ఓ ఉదాహరణను కూడా వివరించాడు.

లీడర్ అంటే ధోనీనే:
దక్షిణాఫ్రికా క్రికెటర్ గ్యారీ కిర్స్టెన్ తాజాగా 'ది ఆర్కే షో'లో మాట్లాడుతూ... ఎంఎస్ ధోనీ, 2011 ప్రపంచకప్నకు ముందు జరిగిన ఓ సంఘటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'నన్ను అమితంగా ఆకర్షించిన వ్యక్తుల్లో ఎంఎస్ ధోనీ కూడా ఒకడు. ఈ విషయం ఎన్నోసార్లు చెప్పా. అతను గొప్ప లీడర్. అలాగే ప్రజల దృష్టిలో మహీ గొప్ప సారథిగా నిలిచిపోయాడు. ధోనీ ఒక్కసారి నమ్మాడంటే.. వారికి అండగా చివరి వరకూ నిలబడతాడు' అని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టన్ తెలిపాడు.

యాత్ర రద్దు చేశాడు:
'ప్రపంచకప్కు ముందు జరిగిన ఓ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. భారత జట్టు బెంగుళూరులో ఉన్నప్పుడు ఒక ఎయిర్ స్కూల్ను సందర్శించడానికి మాకు ఆహ్వానం అందింది. ఆ సమయంలో నాతో పాటు జట్టుతో పాడీ ఆప్టన్, ఎరిక్ సిమ్మన్స్ ఉన్నారు. మేం ముగ్గురం విదేశీయులైనందున భద్రతా కారణాల రిత్యా మమ్మల్ని లోపలి అనుమతించబోమని చెప్పారు. అప్పటికే జట్టులోని ఆటగాళ్లంతా అక్కడికి వెళ్లడానికి సిద్ధమైపోయారు. మమ్మల్ని అనుమతించబోమని చెప్పడంతో.. ధోనీ ఆ మొత్తం పర్యటననే రద్దు చేశాడు. అప్పుడు మహీ ఒకటే మాట చెప్పాడు.. "వీళ్లు నా వాళ్లు. వాళ్లని అనుమతించకపోతే, మేం కూడా రావడం లేదు" అని తేల్చిచెప్పాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు ధోనీ' అని గ్యారీ పేర్కొన్నాడు.

నమ్మకమైన వ్యక్తి:
'2008లో టీమిండియా చీఫ్ కోచ్గా బాధ్యతలు చేపట్టా. అప్పటినుంచే ఎంఎస్ ధోనీతో మంచి సాన్నిహిత్యం ఉండేది. మహీ నాతో ఎంతో నమ్మకంగా ఉండేవాడు. మా కాంబినేషన్లో ఎల్లప్పుడూ విజయాలే సాధించలేదు, కొన్నిసార్లు కఠిన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాం. జట్టును సరైన పద్ధతిలో నడిపించడానికి తరచూ మాట్లాడుకునేవాళ్లం. అలా మా ఇద్దరి మధ్యా బలమైన అనుబంధం ఏర్పడింది' అని గ్యారీ కిర్స్టన్ చెప్పుకొచ్చాడు.

ఎలాంటి అడ్డు చెప్పలేదు:
ఎంఎస్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2007లో తొలి టీ20 ప్రపంచకప్ గెలిచాక గ్యారీ కిర్స్టెన్ హెడ్కోచ్గా నియమితుడయ్యాడు. అతడి శిక్షణలో భారత్ టెస్టుల్లో నంబర్ వన్గా ఎదగడమే కాకుండా, 2011 వన్డే ప్రపంచకప్ సాధించింది. ఆ టోర్నీ ఫైనల్లో యువరాజ్ సింగ్కి బదులుగా బ్యాటింగ్ ఆర్డర్లో ధోనీ ముందుకు వెళ్తానంటే గ్యారీ ఎలాంటి అడ్డు చెప్పలేదు. ప్రపంచకప్ తర్వాత కిర్స్టెన్ టీమిండియా కోచ్గా తప్పుకున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications