పాకిస్థాన్ వైట్ బాల్ జట్లకు కోచ్ పదవి నుంచి గ్యారీ కిర్స్టన్ వైదొలిగాడు. కోచ్గా బాధ్యతలు అందుకున్న ఆరు నెలలకే తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వైఖరి, ఆటగాళ్లతో గొడవలు- భిన్నాభిప్రాయాల మధ్య కొనసాగలేక కిర్స్టన్ పాక్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పాడని తెలుస్తోంది. కిర్స్టన్ వైదొలగడంతో టెస్టు జట్టు కోచ్ జేసన్ గిలెస్పీని వైట్ బాల్ ఫార్మాట్ బాధ్యతలు కూడా అందుకోవాలని పీసీబీ కోరింది.
దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్స్టన్ సక్సెఫుల్ కోచ్గా పేరు పొందాడు. 2011 వన్డే ప్రపంచకప్ భారత్ విజయం సాధించడంలో కిర్స్టన్ పాత్ర కీలకం. అయితే మే నెల మధ్యలో పాకిస్థాన్ వైట్ బాల్ టీమ్ కోచ్గా కిర్స్టన్ బాధ్యతలు అందుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో పాక్ జట్టుతో కోచ్గా తన యాక్షన్ మొదలుపెట్టాడు. అయితే ఆ తర్వాత నెలలోనే జరిగిన టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ ఘోర పరాజయాలన్ని చవిచూసింది.

యూఎస్ఏ చేతిలోనూ ఓటమిపాలై టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అయితే తన రిక్వెస్ట్లను పాక్ బోర్డు పట్టించుకోకపోవడం, ఆటగాళ్లతో భిన్నాభిప్రాయాలతో కిర్స్టన్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. అయితే మరో నాలుగు నెలల్లో సొంతగడ్డపై ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న వేళ కోచ్ రాజీనామా చేయడం పాకిస్థాన్కు ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు తాత్కాలికంగా బాధ్యతలు అందుకోనున్న గిలెస్పీ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు వైట్ బాల్ కోచ్గా కొనసాగడంపై స్పష్టత లేదు. ఇటీవల గిలెస్పీ కూడా పాక్ బోర్డుపై బహిరంగంగానే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ జట్టు ఎంపికలో తనకు ఎలాంటి అధికారం లేదని, టెస్టు మ్యాచ్లో తన వ్యూహాలు పంచుకోవడమే కేవలం తన పని అని తెలిపాడు. కాగా, బాబర్ అజామ్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ను వన్డే, టీ20 జట్లకు కెప్టెన్గా నియమించిన 24 గంటల్లోనే కోచ్ పదవి నుంచి గ్యారీ కిర్స్టన్ తప్పుకోవడం గమనార్హం.