Gary Kirsten and Jason Gillespie: టీ20 వరల్డ్ కప్ 2024 సమీపించింది. జూన్ 4వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 30 వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్ను సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇస్తోన్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్.. సహా వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్లు షెడ్యూల్ కానున్నాయి.
ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. ఈ మెగా టోర్నమెంట్ను క్రికెట్ ఆడే అన్ని దేశాలు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

ఈ టోర్నమెంట్ ఆరంభం కావడానికి ముందు పాకిస్తాన్.. కీలక మార్పులకు తెర తీసింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాకు చెందిన లెజెండరీ ప్లేయర్లు గ్యారీ కిర్స్టెన్, జేసన్ గిలెస్పీని హెడ్ కోచ్లుగా అపాయింట్ చేసింది. గతంలో ఇదే గ్యారీ కిర్స్టెన్.. టీమిండియాకు హెడ్ కోచ్గా పనిచేసిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్ వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్కు గ్యారీ కిర్స్టెన్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తాడు. టెస్ట్ ఫార్మట్లకు జేసన్ గిలెస్పీ కోచ్గా ఉంటాడు. వారిద్దరినీ కోచ్లుగా అపాయింట్ చేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. జట్టు కోచింగ్ స్టాఫ్లో సమూల మార్పులు చేసినట్లు తెలిపింది.
2025లో జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ 2025 టోర్నమెంట్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ తరఫున ఇన్ఛార్జీగా నియమితులయ్యాడు. ఈ రెండు టోర్నమెంట్లు కూడా పాకిస్తాన్లో జరగనున్నాయి. దీనితో పాటు భారత్, శ్రీలంక ఆతిథ్యాన్ని ఇవ్వబోయే టీ20 వరల్డ్ కప్ 2016కూ అతనే ఇన్ఛార్జ్గా ఉంటాడు.
గ్యారీ కిర్స్టెన్.. హెడ్ కోచ్గా ఉన్న సమయంలోనే భారత జట్టు ఐసీసీ వరల్డ్ కప్ను గెలుచుకున్న విషయం తెలిసిందే. 2011లో టీమిండియా తన రెండో వరల్డ్ కప్ను సాధించింది. అప్పట్లో గ్యారీ కిర్స్టెన్- మహేంద్ర సింగ్ ధోనీ ద్వయం.. జట్టుకు అత్యున్నత స్థాయికి తీసుకెళ్లింది.
ఐపీఎల్లో గ్యారీ కిర్స్టెన్.. గుజరాత్ టైటాన్స్కు బ్యాటింగ్ కోచ్గా పని చేస్తోన్నాడు. ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే అతను పాకిస్తాన్ జట్టుతో కలిసే అవకాశం ఉంది. జేసన్ గిల్లెస్పీ కూడా గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు బౌలింగ్ కోచ్గా పని చేశాడు.