
దుబాయ్: ఇటీవలి కాలంలో స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్లను ఓడించిన బంగ్లాదేశ్.. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2021 వార్మప్ మ్యాచ్లో మాత్రం తేలిపోయింది. అబుదాబిలో జరిగిన వార్మప్ మ్యాచ్లో పసికూన ఐర్లాండ్ చేతిలో 33 పరుగుల తేడాతో బంగ్లా చిత్తయింది. దాంతో క్వాలిఫైర్ మ్యాచులకు ముందు బంగ్లాకు భారీ షాక్ తగిలింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఆపై బంగ్లాదేశ్ కేవలం 144 పరుగులకే ఆలౌట్ అయి ఘోర ఓటమిని చవిచూసింది. సౌమ్య సర్కార్, నరుల్ హసన్ మినహా మిగతావారంతా విఫలమయ్యారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ మంచి ఆరంభాన్ని అందించాడు. 16 బంతుల్లో 5 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. కెప్టెన్ ఆండీ బుల్బిరిని (25) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక గారెత్ డెలానీ వీరవిహారం వేశాడు. సిక్సుల వర్షం కురిపిస్తూ బంగ్లాదేశ్ బౌలర్లను చిత్తు చేశాడు. డెలానీ 50 బంతుల్లో 8 సిక్సర్లు, 3 ఫోర్లతో 88 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దాంతో ఐర్లాండ్ భారీ స్కోర్ చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్, మెహదీ హసన్ మినహా, మిగిలిన వారంతా తీవ్రంగా నిరాశపరిచారు. స్టార్ పేసర్ ముస్తీఫిజుర్ రెహమాన్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు. షోరిఫుల్ ఇస్లాం 4 ఓవర్లలో 41 పరుగులు, నసుమ్ అహ్మద్ 3 ఓవర్లలో 33 పరుగులు సమర్పించుకున్నారు.
భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఓపెనర్లు విఫలమయ్యారు. మహ్మద్ నయీమ్ (3), కెప్టెన్ లిటన్ దాస్ (1) త్వరగానే పెవిలియన్ చేరి నిరాశపరిచారు. వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ 4 పరుగులు మాత్రమే చేశాడు. ఐఐటీ సౌమ్య సర్కార్ (37), నరుల్ హసన్ (38) రాణించినా బంగ్లాను గెలిపించలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్లు చెలరేగడంతో వరుస విరామంలో వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 144 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో ఐర్లాండ్తో ఓడిపోవడం బంగ్లాదేశ్కు ఎదరుదెబ్బే అని చెప్పాలి. ఐపీఎల్ 2021లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ సేవలను బంగ్లా కోల్పోయింది. బుధవారం క్వాలిఫయర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్పై షకీబ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
మరో రెండు రోజుల్లో (అక్టోబర్ 17) టీ20 ప్రపంచకప్ 2021 ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచులు జరుగుతుండగా.. అక్టోబర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. క్వాలిఫైర్ మ్యాచులలో సత్తాచాటితేనే బంగ్లాదేశ్ సూపర్ 12లోకి ప్రవేశించనుంది. ప్రాక్టీస్ మ్యాచులలో తేలిపోయిన బంగ్లా.. క్వాలిఫైర్ మ్యాచులలో అయినా సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. అక్టోబర్ 23న అసలు సమరం.. సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్లో భాగంగా అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. అదేరోజు వెస్టిండీస్తో ఇంగ్లండ్ మ్యాచ్ జరగనుంది.