వన్డే వరల్డ్ కప్లో ఫేవరెట్గా భారత జట్టు బరిలో దిగుతోంది. ఈ క్రమంలో టీం ఎంపికపై చాలా చర్చ జరుగుతోంది. ఎవర్ని తీసుకోవాలి? ఎవరు ఫిట్గా ఉంటారు? అని చాలా మంది ఇప్పుడే లెక్కలు కట్టేస్తున్నారు. ఇలాంటి సమయంలో టీమిండియా లెజెండ్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కీలక సూచన చేశాడు. కచ్చితంగా వన్డే వరల్డ్ కప్లో ఉండాలంటూ ఒక కుర్రాడి పేరును సజెస్ట్ చేశాడు.
అతను ఎవరో కాదు.. వెస్టిండీస్పై టెస్టు అరంగేట్రంలోనే అద్భుతమైన సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఈ ముంబై కుర్రాడు ఏకంగా 171 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతని ప్రదర్శనకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా అందుకున్నాడు. ఐపీఎల్, దేశవాళీల్లో అద్భుతమైన ప్రదర్శనలతో ఈ కుర్రాడు టీమిండియాలోకి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే.

వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో రిజర్వ్ ప్లేయర్గా ఎంపికైన జైస్వాల్.. విండీస్పై తొలి టెస్టులో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో అతని ఆటతీరుపై గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. అరంగేట్రంలో సెంచరీ చేయడం అంటే మాటలు కాదని, జైస్వాల్ అత్యద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. అందుకే అతన్ని వరల్డ్ కప్లో కూడా ఆడించాలని సూచించాడు.
'అరంగేట్రంలో శతకం బాదడం చాలా గొప్ప విషయం. నేను కూడా అలాగే అరంగేట్రంలో సెంచరీ చేశా. కాబట్టి అది ఎంత స్పెషలో నాకు బాగా తెలుసు. టెక్నిక్ పరంగా చూసుకున్నా కూడా.. జైస్వాల్ చాలా సాలిడ్గా కనిపిస్తున్నాడు. టీంలో లెఫ్ట్ హ్యాండర్ ఉండటం ఎప్పుడూ మంచిదే. కాబట్టి అతన్ని వరల్డ్ కప్లో కూడా ఆడించడం తప్పనిసరి' అని గంగూలీ చెప్పాడు. ఈ మెగాటోర్నీలో జట్టుకు జైస్వాల్ చాలా ఉపయోగకరంగా ఉంటాడని తెలిపాడు. మరి సెలెక్టర్లు ఏం చేస్తారో చూడాలి.