
హైదరాబాద్: టీ20ల్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఆటతీరుని మార్చుకోవాలని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించాడు. టీ20లకు ధోని వీడ్కోలు పలికి యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలని ఇటీవల విమర్శలు వచ్చిన నేపథ్యంలో సౌరవ్ గంగూలీ స్పందించాడు.
'వన్డేలతో పోలిస్తే టీ20ల్లో ధోనీ రికార్డు ఏమంత గొప్పగా లేదు. ఈ విషయంపై జట్టు మేనేజ్ మెంట్, కెప్టెన్ విరాట్ కోహ్లిలు ప్రత్యేకంగా ధోనితో మాట్లాడాలి. ధోనిలో సామర్థ్యానికి కొదవలేదు. కాకపోతే టీ 20ల్లో భిన్నంగా బ్యాటింగ్ చేస్తేనే ధోని కచ్చితంగా సక్సెస్ అవుతాడు' అని గంగూలీ అన్నాడు.
న్యూజిలాండ్తో రాజ్కోట్ వేదికగా రెండో టీ20లో 197 పరుగుల ఛేదనలో భారత్ 97/4తో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ధోని.. కోహ్లీతో కలిసి దూకుడుగా ఆడలేకపోయాడు. అయితే ధోనిలో ఇంకా క్రికెట్ ఉందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
'వన్డేలనే కాదు టీ20లను ఆయన బాగా ఆడగలడు. ధోని టీ20లను స్వేచ్ఛగా ఆడాలి. అతడిలో ఇంకా చాలా క్రికెట్ ఉంది. టీ20ల్లో స్వేచ్ఛగా ఆడటానికి ధోని యత్నించాలి. అందుకు సెలక్టర్లకు కూడా సహకరించాలి. ధోని ఆడటానికి స్వేచ్చాయుత వాతావరణం కల్పిస్తే మరొ కొత్త ధోనిని చూస్తాం' అని గంగూలీ పేర్కొన్నాడు.
కాగా, శ్రీలంకతో టెస్టు సిరీస్కు పాండ్యాకు విశ్రాంతి కల్పించడంపై గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'ఈడెన్లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడడం కష్టం. హార్దిక్ను రాబోవు టెస్టు సిరీస్కు పక్కకు పెట్టడం ఆశ్చర్యం కలిగించింది. అతను గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లేతే అది నాకు తెలీదు' అని దాదా అన్నాడు.
'తాను కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. టెస్టు క్రికెట్ ఆడటానికి అతనికి ఇదే సరైన వయసు. పాండ్యా గాయపడ్డాడా లేదా అన్నది నాకు తెలీదు. త్వరలోనే అతను ఫిట్ అవుతాడని ఆశిస్తున్నా. పాక్పై 2-0తో టెస్టు సిరీస్ గెలిచిన శ్రీలంక సైతం కివీస్ తరహాలోనే గట్టి పోటీనిస్తుందని ఆశిస్తున్నా' అని గంగూలీ పేర్కొన్నాడు.