కోల్ కత్తా: వచ్చే 7,8 నెలల్లో తాను వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటానని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పారు. వన్టే జట్టు నుంచి బిసిసిఐ సెలెక్టర్లు గంగూలీని తప్పించిన విషయం తెలిసిందే. 2011లో జరిగే వన్డే ప్రపంచ కప్ పోటీల్లో తాను ఆడకపోవచ్చునని ఆయన అన్నారు. సెలెక్టర్లు అడిగితే మరో కొద్ది నెలలు వన్డేలు ఆడుతానని ఆయన చెప్పారు. వన్డే క్రికెట్ లో కొనసాగుతారా అని సెలెక్టర్లు అడిగారని, తాను మరో ఏడెనిమిది నెలలు కొనసాగుతానని చెప్పానని ఆయన వివరించారు.
ఈ ఏడెనిమిది నెలల్లో పెద్దగా వన్డే సిరీస్ లు లేవని, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టెస్టు, వన్డే సిరీస్ లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు శ్రీలంక వెళ్తుందని, ఐదు వన్డేలు, సెప్టెంబర్ లో ఛాంపియన్ ట్రోఫీ మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు. తాను సెప్టెంబర్ వరకు వన్డే సిరీస్ లో ఆడదలుచుకున్నట్లు ఆయన ఇండియన్ న్యూస్ ఛానెల్ తో తెలిపారు. తనను వన్డే జట్టు నుంచి తప్పించడు కాస్తా ఆశ్చర్యం కలిగించిందని, ఫామ్ కారణంగా తనను తప్పించలేదని ఆయన అన్నారు. మీడియా తన పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.