హైదరాబాద్: ఇంగ్లాండ్తో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో టీమిండియా తుది జట్టు ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో కీలకంగా మారతాడనుకున్న రాహుల్ను ఎంపిక చేసుకోకపోవడాన్ని తప్పుబట్టాడు. నిర్ణయాత్మక మూడో వన్డేలో తుది జట్టు ఎంపిక తనని నిరాశపరిచిందని గంగూలీ వెల్లడించాడు. ఈ మ్యాచ్కి కామెంటేటర్గా పనిచేసిన గంగూలీ.. భారత్ తుది జట్టు గురించి మాట్లాడుతుండగా.. మీరు కెప్టెన్గా ఉంటే ఎవరికి నాలుగో స్థానంలో అవకాశం కల్పిస్తారు..? అని వ్యాఖ్యాత హర్షాభోగ్లే ప్రశ్నించాడు.
దీంతో.. కాసేపు కళ్లు మూసుకుని ఆలోచించిన గంగూలీ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. 'నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ని ఆడిస్తాను. టాప్ ఆర్డర్.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే బ్యాట్స్మెన్.. జట్టు అత్యుత్తమ బ్యాట్స్మెన్లో ఒకడిగా ఉండాలి. అతడ్ని జట్టులో కొనసాగిస్తూ ఉండాలి' అని గంగూలీ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత నువ్వు వెళ్లి కేఎల్ రాహుల్తో చెప్పు.. 'నేనైతే ఓ 15 మ్యాచ్ల్లో అవకాశం ఇస్తాను.. స్వేచ్ఛగా ఆడుకోమంటూ' అని సరదాగా కామెంటరీ బాక్స్లో నవ్వులు పూయించాడు.
మంగళవారం రాత్రి ముగిసిన ఈ వన్డేలో కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (21: 22 బంతుల్లో 3 ఫోర్లు) విఫలమవగా.. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులకే పరిమితమైంది. జట్టులో విరాట్ కోహ్లి (71: 72 బంతుల్లో 8ఫోర్లు) మాత్రమే మెరుగ్గా ఆడాడు.
అనంతరం చేధనకు దిగిన ఇంగ్లాండ్ లక్ష్యాన్ని 44.3 ఓవర్లలోనే 260/2తో బాదేసి విజేతగా నిలిచింది. ఆ జట్టులో జో రూట్ (100 నాటౌట్: 120 బంతుల్లో 10ఫోర్లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (88 నాటౌట్: 108 బంతుల్లో 9ఫోర్లు, ఒక సిక్సు) బాధ్యతాయుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మూడో వన్డేలో గెలుపొందిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్ను 2-1తో చేజిక్కించుకుంది.