చెన్నై: తన ఎంపిక సరైందనే విషయాన్ని ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు మ్యాచుల్లో నిరూపిస్తానని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. కోల్ కోత్తా నుంచి చెన్నై నుంచి గురువారం ఉదయం చెన్నైకి చేరుకున్న ఆయన విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను బాగా ఆడుతున్నానని, ఆస్ట్రేలియాతో ఆడే సమయంలో మీ కళ్లతో మీరే చూస్తారు కదా అని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా మంచి జట్టు అని, ఏ పరిస్థితిలోనైనా ఆ జట్టుకు ఆడే సత్తా ఉందని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
ఆస్ట్రేలియాపై భారత్ బాగా ఆడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సిరీస్ విజయానికి తమ జట్టు ఆస్ట్రేలియా కన్నా మెరుగుగా ఆడగలదని ఆయన అన్నారు. ఎంఎ చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్ ఎతో భారత్ ఎ నాలుగు రోజుల మ్యాచు రేపు ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో పాల్గొనడానికి గంగూలీ ఇక్కడికి వచ్చారు. తనపై విశ్వాసం ఉంచి తనను జట్టుకు ఎంపిక చేసిని బిసిసిఐ సెలెక్షన్ కమిటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.