కోల్ కత్తా: వన్డే క్రికెట్ జట్టులోకి సౌరవ్ గంగూలీని తీసుకోకపోవడంపై ఆగ్రహించిన ఆయన అభిమానులను రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. తూర్పు రైల్వే సెక్షన్లలోని కొన్ని రైలు సర్వీసులపై దాని ప్రభావం పడింది. నార్త్ 24 పరగణాలోని బరాసత్ లో రైల్వే ట్రాక్ పై గంగూలీ అభిమానులు అడ్డంకులు కల్పించారు. దాదాను తీసుకోవాల్సిందే, గంగూలీని తీసుకోకపోవడం కుట్ర అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. దీంతో బరాసత్ - బోంగావ్, బరాసత్ - హస్నాబాద్ ల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆస్ట్రేలియాలో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్ కు ఎంపికైన జట్టులో గంగూలీకి సెలెక్టర్లు స్థానం కల్పించలేదు. అలాగే ద్రావిడ్, వివియస్ లక్ష్మణ్ ల పేర్లను పరిశీలనలోకి కూడా తీసుకోలేదు. గంగూలీ ఇంటి ముందు దాదాపు 40 మంది క్రికెట్ అభిమానులు గుమిగూడి బిసిసిఐ అధ్యక్షుడు శరద్ పవార్ కు, సెలెక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శరద్ పవార్ దిష్టిబొమ్మను చెప్పులతో, బూట్లతో కొట్టి దగ్ధం చేశారు.