పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ అయిదు వికెట్ల నష్టానికి 616 పరుగుల భారీ స్కోరు వద్దు తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ వసీమ్ జాఫర్(202) డబుల్ సెంచరీ, సౌరవ్ గంగూలీ (102), వివియస్ లక్ష్మణ్(112 నాటౌట్) సెంచరీలు చేయడంతో భారత జట్టు ఈ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ వసీమ్ జాఫర్ తన వ్యక్తిగత ఓవర్ నైట్ స్కోరు 192 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ను కొనసాగించి డబుల్ సెంచరీ పూర్తి చేసుకొని సొహైల్ తన్వీర్ బౌలింగ్ లో అక్మల్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 34 ఫోర్లు కొట్టిన జాఫర్ జట్టు స్కోరు 375 పరుగుల వద్ద పెవిలియన్ దారి పట్టాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన వివియస్ లక్ష్మణ్, గంగూలీతో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. వీరిద్దరూ చెరో సెంచరీ సాధించడమే కాకుండా అయిదవ వికెట్ కు 163 పరుగులు జోడించారు. సెంచరీ పూర్తి చేసుకున్న కొద్ది సేపటికే గంగూలీ సల్మాన్ భట్ బౌలింగ్ అవుటయ్యాడు. తదుపరి వచ్చిన మహేంద్రసింగ్ ధోని వివియస్ లక్ష్మణ్ తో కలిసి పాక్ బోలర్లను బెంబేలెత్తించారు. వీరిద్దరూ కలిసి అభేద్యమైన ఆరో వికెట్ కు 78 పరుగులు జోడించారు. ఈ లోపు ధోని కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు 600 పరుగుల మైలురాయి దాటి అదనంగా 16 పరుగులు చేయడంతో కెప్టెన్ అనిల్ కుంబ్లే తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. వివియస్ లక్ష్మణ్ 15 ఫోర్లతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 82 బంతుల్లో ఆరు ఫోర్లతో ధోని సరిగ్గా 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.