బీసీసీఐ పగ్గాలు చేపట్టిన గంగూలీ:
ఎలక్టోరల్ ఆఫీసర్ ఎన్. గోపాలస్వామి చేతుల మీదుగా గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. సీఓఏ సభ్యులు, రాష్ట్ర సంఘాల ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. గంగూలీతో పాటు నలుగురు ఆఫీస్ బియరర్లు సీఓఏ నుంచి సంపూర్ణంగా బాధ్యతలు స్వీకరించారు. దాదా బీసీసీఐ కొత్త బాస్గా బాధ్యతలు స్వీకరించడంతో.. బోర్డు పగ్గాలు చేపట్టిన రెండవ క్రికెటర్గా నిలిచారు. 65 ఏళ్ల తర్వాత ఓ మాజీ క్రికెటర్ బీసీసీఐ బోర్డు పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి.
రాజ్యాగం ప్రకారం ఎన్నికలు నిర్వహించాం:
సీఓఏ గత 33 నెలల నుంచి బీసీసీఐ బోర్డును నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ, లెఫ్టినెంట్ రవి తోడ్జేలు సీఓఏ సభ్యులుగా కొనసాగారు. ఎన్నికయిన నూతన కార్యవర్గం బోర్డులో పూర్తిస్థాయి పాలన పగ్గాలు చేపట్టడంతో సీఓఏకి నేటితో శుభం కార్డు పడినట్లైంది. దాదా నియామకంపై వినోద్ రాయ్ మాట్లాడుతూ... 'రాజ్యాగం ప్రకారం బీసీసీఐలో ఎన్నికలు నిర్వహించాం. అది మా బాధ్యత. సంతృప్తికరంగానే బీసీసీఐని వీడుతున్నాం. దాదాకు అభినందనలు' అని అన్నారు.
దాదా కన్నా బెటర్ ఎవరూ లేరు:
'గంగూలీ పట్ల ఎంతో గౌరవం ఉంది. ఉత్తమ కెప్టెన్. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ను సమర్థవంతంగా నిర్వహించడం అతని సామర్థ్యంను వెలికితీసింది. బీసీసీఐని కూడా సమర్థవంతంగా నడుపుతాడనే నమ్మకం ఉంది. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు గంగూలీ కన్నా బెటర్ వ్యక్తి ఎవరూ లేరు. ప్రస్తుతం నలుగురు మాజీ ఆటగాళ్లు ఉన్నారు. వారి అనుభవం బోర్డుకు ఉపయోగపడనుంది' అని రాయ్ తెలిపారు.
బీసీసీఐని ఉన్నత స్థానాలకు చేరుస్తాడు:
ఒక మాజీ క్రికెటర్ బీసీసీఐ పగ్గాలు చేపట్టడం సంతోషంగా ఉందని సీఓఏలోని సభ్యురాలు డయానా ఎడుల్జీ అన్నారు. బీసీసీఐని గంగూలీ మరింత ఉన్నత స్థానాలకు చేరుస్తాడని ఎడుల్జీ పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా నియమితులయ్యారు. అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ సింగ్ ధూమల్ కోశాధికారిగా, ఉత్తరాఖండ్కు చెందిన మాహిమ్ వర్మ ఉపాధ్యక్షుడిగా, జాయింట్ సెక్రటరీగా జయేష్ జార్జ్ బాధ్యతలు స్వీకరించారు.