న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా నాయకుల పైన ధ్వజమెత్తారు. ఇక్కడున్న దోమలనే మనవాళ్లు తరిమేయలేకపోతున్నారని, ఇక సరిహద్దుల్లోని వారిని ఎలా తరిమేస్తారని చురకలు వేశారు.
ఉగ్రదాడులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న పాకిస్తాన్ పైన ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోలేకపోవడాన్ని తద్వారా ఆయన దుయ్యబట్టారు. ఉగ్రవాదులను దోమలతో పోలీస్తూ ట్వీట్ చేశారు.

తన బాధ ఏమిటంటే మన నేతలు సరిహద్దులు దాటి వచ్చే దోమలను ఆపలేకపోతున్నారని, అలాగే కనీసం సరికదా, దేశంలోని దోమలను కూడా తరమలేకపోతున్నారని ట్వీట్ చేశారు.
ఇటీవలి వర్షాల అనంతరం దేశ రాజధాని న్యూఢిల్లీలో నిలిచిన నీరు, దాంతో ప్రబలిన డెంగ్యూ, చికున్ గున్యాలను గుర్తు చేశాడు. గంభీర్ పెట్టిన ఈ ట్వీట్ను వేలాదిమంది రీట్వీట్ చేస్తున్నారు. కాగా, గౌతమ్ గంభీర్ అమర జవాన్లకు నివాళులు అర్పించారు.