91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల సిరీస్లో టీమిండియా తొలిసారి వైట్వాష్కు గురికావడంపై బీసీసీఐ చాలా సీరియస్గా ఉంది. న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాజయానికి సమీక్షలు చేపడుతోంది. ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టడానికి కూడా సిద్ధమైంది. అంతేగాక కోచ్ గౌతమ్ గంభీర్కు ఉన్న కొన్ని ప్రత్యేక అధికారాలను తొలిగించాలని నిర్ణయించుకుంది.
కివీస్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను భారత్ 0-3తో కోల్పోయిన విషయం తెలిసిందే. వాంఖడే వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 121 పరుగులకే కుప్పకూలింది. ఈ ఏడాది స్వదేశంలో టెస్టు ఫార్మాట్లో భారత్కు ఇది నాలుగో ఓటమి. 1969 తర్వాత సొంతగడ్డపై ఓ ఏడాది అత్యధిక టెస్టులు ఓడటం ఇదే ప్రథమం. అయితే ఈ క్రమంలో కోచ్గా గంభీర్ పనితీరును బీసీసీఐ సమీక్షిస్తోంది.

రాహుల్ ద్రవిడ్ అనంతరం గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు అందుకున్న అనంతరం ఒక్క విజయం లేకుండా భారత్ ఓ సిరీస్ను ముగించడం ఇది రెండోసారి. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్లో టీమిండియా 0-2తో కోల్పోయింది. అయితే సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో గంభీర్ వ్యూహాలు దారుణంగా విఫలమవ్వడంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తిగా ఉంది. వాంఖడే టెస్టులో ర్యాంక్ టర్నర్ పిచ్ కావాలని గంభీర్ పట్టుబట్టడం భారత్కు ఏమాత్రం కలిసిరాలేదు.
అంతేగాక తొలి ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ ఖాన్ను ఎనిమిదో స్థానంలో పంపించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక స్పిన్ను ఎదుర్కోవడానికి బ్యాటర్లను సమర్థవంతంగా సన్నద్ధం చేయకపోవడంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో జట్టును ఎంపిక చేయడంలో గంభీర్కు ఇచ్చిన స్వేచ్ఛను బీసీసీఐ తొలగించనుంది. జట్టు ఎంపికలో గత కోచ్లు రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రికి బీసీసీఐ ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. కానీ గంభీర్కు ఈ ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. అయితే ఘోర పరాజయాల నేపథ్యంలో ఆ అధికారాల్ని తొలగించాలని బీసీసీఐ నిర్ణయించుకుందని తెలుస్తోంది.