టీ20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమించిన తర్వాత జట్టు కెప్టెన్సీలో మార్పులు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్లో జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించాలని భావిస్తోంది. రోహిత్ కూడా తన కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. మరో టీ20 వరల్డ్ కప్లో అతను ఆడే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా న్యూజిల్యాండ్లో టీ20 సిరీస్ నెగ్గిన హార్దిక్ పాండ్యా.. విరాట్ కోహ్లీ తర్వాత కివీ గడ్డపై టీ20 సిరీస్ నెగ్గిన రెండో భారత కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. గుజరాత్ టైటాన్స్ సారధిగా ఐపీఎల్లో అదిరిపోయే నాయకత్వ లక్షణాలు చూపించిన పాండ్యాను గంభీర్ కూడా మెచ్చుకున్నాడు. కచ్చితంగా పాండ్యా కెప్టెన్సీ రేసులో ఉంటాడన్న గంభీర్.. కానీ కేవలం ఒక్క ఐసీసీ ఈవెంట్లో విఫలం అవడంతో రోహిత్ సారధ్య సత్తాను అంచనా వేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు.
అదే సమయంలో పాండ్యా కన్నా కూడా పృథ్వీ షా ఎగ్రెసివ్ కెప్టెన్ అని గంభీర్ అన్నాడు. 'పాండ్యాలో కచ్చితంగా కెప్టెన్ లక్షణాలు ఉన్నాయి. కానీ నన్నడిగితే ఎగ్రెసివ్ కెప్టెన్ కావాలంటే పృథ్వీ షానే బెటర్. ఒక ప్లేయర్ ఆడే విధానాన్ని బట్టి అతను ఎంత ఎగ్రెసివ్ అనేది చెప్పొచ్చు. ఈ లెక్కన చూసుకున్నా షా చాలా ఎగ్రెసివ్ కెప్టెన్. కచ్చితంగా జట్టును ముందుకు తీసుకెళ్తాడు' అని కొనియాడాడు.
అంతకుముందు 2018లో భారత అండర్-19 జట్టుకు నాయకత్వం వహించిన పృథ్వీ షా.. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. భారత్ తరఫున అరంగేట్రంలోనే సెంచరీతో చెలరేగిన అతను జట్టుతో కలిసి చాలా క్రికెట్ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ 2019లో డోపింగ్ టెస్టులో విఫలం అవడం అతని కెరీర్ను మార్చేసింది. అప్పటి నుంచి మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం కోసం ఎదురు చూస్తూనే ఉండిపోయాడు.