
టీమిండియా, కివీస్ మధ్య జరిగిన రెండో టీ20 అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదవకపోయినా.. ఒక మోస్తరు స్కోర్లు అయినా నమోదవుతాయని అంతా అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్లో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిల్యాండ్ జట్టు 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతేకాదు, దాదాపుగా తన స్కోరును డిఫెండ్ కూడా చేసుకుంది. భారత జట్టు 19.5 ఓవర్లలో 101 పరుగులు చేసి విజయం సాధించింది.
అద్భుతమైన టర్న్కు తోడు ఊహించని బౌన్స్తో లక్నో పిచ్.. బ్యాటర్లకు అగ్ని పరీక్షలా కనిపించింది. బంతి గమనాన్ని అంచనా వేయడానికి బ్యాటర్లు తిప్పలు పడ్డారు. ఈ మ్యాచ్ సమయంలో కామెంటరీ చేస్తున్న మాజీ దిగ్గజం గౌతమ్ గంభీర్ వెటకారం ఆడాడు. ఈ పిచ్ను చూస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ కీలక ప్లేయర్, సఫారీ ఆటగాడు క్వింటన్ డీ కాక్ మళ్లీ ఐపీఎల్ ఆడేందుకు రాడని గంభీర్ చెప్పాడు. 'ఈ పిచ్ చూస్తే ఐపీఎల్ ఆడటానికి డీకాక్ రాడేమో?' అన్నాడు. అతనితోపాటు కామెంటరీ చెప్తున్న మహమ్మద్ కైఫ్ నవ్వేస్తూ.. 'ఏం పర్లేదు. తను వస్తాడులే' అని చెప్పాడు.
లక్నో పిచ్ స్పిన్నర్లకు చాలా బాాగా సహకరించింది. బౌలింగ్ చేసిన ప్రతి స్పిన్ బౌలర్ వికెట్లు తీసుకున్నాడు. పేసర్లు కూడా ఫర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్లో న్యూజిల్యాండ్ బ్యాటర్లను టీమిండియా స్పిన్నర్లు ముప్పుతిప్పలు పెట్టారు. అలాగే భారత బ్యాటర్లను కివీస్ స్పిన్నర్లు ఇబ్బంది పెట్టారు. ఇది చూసిన గంభీర్.. డీకాక్ రాడంటూ జోకులు పేల్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్గా ఉన్న క్వింటన్ డీ కాక్.. ఆ జట్టుకు చాలా కీలకమైన ఆటగాడన్న సంగతి తెలిసిందే. అయితే మినీ వేలంలో తాము కొనుగోలు చేసిన అమిత్ మిశ్రా కానీ, జట్టులో ఉన్న యువ స్పిన్నర్ రవి బిష్ణోయి కానీ అయితే ఈ పిచ్ను చక్కగా ఉపయోగించుకుంటారని గంభీర్ చెప్పాడు.