ఆసియా కప్ గెలిచిన టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారిన అంశం శ్రేయాస్ అయ్యర్. వెన్నునొప్పి కారణంగా ఆటకు దూరమైన అతను.. శస్త్రచికిత్స తర్వాత ఎన్సీయేలో రీహాబిలేషన్లో ఉన్నాడు. తాజాగా ఆసియా కప్లో జట్టుతో చేరిన అతను.. పాకిస్తాన్తో జరిగిన గ్రూప్ దశ మ్యాచులో 14 పరుగులు చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఆడలేదు.
నేపాల్తో మ్యాచులో అయ్యర్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత సూపర్-4 మ్యాచుల్లో మళ్లీ వెన్ను సమస్య రావడంతో అతను ఆడలేదు. బంగ్లాదేశ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్, ఆసియా కప్ ఫైనల్లో కూడా అయ్యర్ అందుబాటులో లేడు. అతను కోలుకున్నాడని, కానీ విశ్రాంతి అవసరమని మెడికల్ టీం భావిస్తోందని బీసీసీఐ తెలిపింది.

అయ్యర్ విషయంలో గౌతం గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వెన్నుగాయం తిరగబెట్టడంతో అతను వన్డే వరల్డ్ కప్ కూడా ఆడేలా కనిపించడం లేదు. ఇలాంటి సమస్య ఉన్న అయ్యర్ను వరల్డ్ కప్ వంటి సీరియస్ టోర్నమెంట్కు సెలెక్ట్ చేయడం అసాధ్యమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇది చాలా ఆందోళనకర సమస్య అని చెప్పాడు.
'సుదీర్ఘ కాలం ఆటకు దూరంగా ఉన్న అయ్యర్.. రీఎంట్రీలో ఒక్క మ్యాచ్ ఆడగానే మళ్లీ అన్ఫిట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో అతన్ని వరల్డ్ కప్ వంటి బడా టోర్నీకి ఎంపిక చేస్తారని నేను అనుకోవడం లేదు. తన స్థానాన్ని మరొకరు భర్తీ చేయడం మనం చూస్తాం. వరల్డ్ కప్ ఎప్పుడొచ్చినా ఫిట్గా ఉన్న ప్లేయర్లతోనే ఆడాలి' అని గంభీర్ స్పష్టం చేశాడు.
ఆటగాళ్ల ఫిట్నెస్కు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని, అదే సమయంలో అయ్యర్ ఫామ్ కూడా అంతుచిక్కని విషయమే అని అభిప్రాయపడ్డాడీ మాజీ లెజెండ్. ఆరు నెలల్లో అతను ఒకే ఒక్క ఇన్నింగ్స్ ఆడాడని గుర్తుచేశాడు. 'పెర్ఫామెన్స్ అనేది వేరే సమస్య. ఒక ప్లేయర్ సడెన్గా గాయపడితే అతని స్థానాన్ని రిప్లేస్ చేసే వాళ్లను వెతకడం కష్టం' అని గంభీర్ అన్నాడు.
'కాబట్టి అయ్యర్ ఈ టోర్నీలో ఫిట్గా లేకపోతే వరల్డ్ కప్లో అతను ఆడటం కూడా సమస్యే. కేవలం అతని గాయమే కాదు. ఫామ్ కూడా ఎలా ఉందో మనకు తెలియదు. తన ఫామ్ గురించి మాట్లాడిన అది 7-8 నెలల కిందటి మాట. ఆ తర్వాత తను ఆడింది ఒక్క మ్యాచే. అతని ఫిట్నెస్ గురించి ఎన్సీయేను ప్రశ్నించాలి. తన విషయంలో ఎందుకు తొందర పడ్డారో అడగాలి' అని నిలదీశాడు.